ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి సదానంద గౌడతో కలిసి అక్టోబర్ 24, గురువారం నాడు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని (సీపెట్) ను ప్రారంభించారు. ఉదయం 11.00 గంటలకు వారిద్దరూ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మొత్తం 12 ఎకరాల విస్తీర్ణంలో రూ. 50 కోట్లతో ఇక్కడ సీపెట్ భవనాలను నిర్మించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ, సీపెట్ లాంటి మరిన్ని సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొల్పాలని కోరారు. సీపెట్లో శిక్షణ పొందే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని, ఈ దేశంలో చట్టం చేసిన తోలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ యే అని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతలో నైపుణ్యాన్ని తీర్చిదిద్దే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
కేంద్రమంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో సీపెట్ సంస్థ ఏర్పాటుకు ముఖ్యమంత్రి మంచి సహకారం అందించారని చెప్పారు. దేశం మరియు రాష్ట్రాల అభివృద్ధిలో ఇలాంటి సంస్థలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా యువతలో నైపుణ్యాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలో ఇప్పటికే 37 సీపెట్ కేంద్రాలుండగా, మరో అయిదుచోట్ల సీపెట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీపెట్ డైరెక్టర్ కిరణ్కుమార్, కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పార్థసారధి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
[subscribe]