టిఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు. ఈ రోజు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో స్వామి గౌడ్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా స్వామి గౌడ్ కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇటీవలే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వామి గౌడ్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.
ముందుగా ఉద్యోగ సంఘాల నేతగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో స్వామిగౌడ్ కీలక పాత్ర పోషించారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీలో చేరి కరీంనగర్ నుంచి గ్రాడ్యుయేట్స్ విభాగంలో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 2014 నుంచి 2019 వరకు తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. అయితే గత కొంతకాలంగా స్వామి గౌడ్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో స్వామి గౌడ్ బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ