ఆంధప్రదేశ్ రాష్ట్రంలో చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు రూపకల్పన చేసిన ‘జగనన్న తోడు’ పథకాన్ని నవంబర్ 25, బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందిస్తున్నారు. ఈ రోజు క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించి, 9.05 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.905 కోట్ల వడ్డీలేని రుణాలను జమ చేశారు. ఈ రుణాలపై అయ్యే వడ్డీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఈరోజు మంచి, గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నామని అన్నారు. తన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అవస్థలు పడుతున్నవారిని ఎంతోమందిని చూశానని చెప్పారు. పలెల నుంచి పట్టణాలు, నగరాల వరకు వీధివీధికీ తిరుగుతూ చిన్న చిన్న విక్రయ సేవలు అందిస్తున్న లక్షలమంది కోసమే జగనన్న తోడు పథకం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చిన్న వ్యాపారులు అనేకంటే వారిని ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలు అందింస్తున్నవారిగా గుర్తించాలని చెప్పారు. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీ చెల్లించే బాధ్యత తీసుకుంటూ, నమ్మకం కలిగించడంతో బ్యాంకులు దాదాపుగా 10 లక్షలమందికి రూ.1000 కోట్లు ఇవ్వనున్నాయని చెప్పారు. అలాగే ఈ పథకానికి ఇంకా ఎవరైనా అర్హులుగా భావిస్తే గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. పరిశీలన చేసిన అనంతరం వారికీ కూడా 2 నెలలలోపులోనే ఈ పథకం వర్తించేలా చేస్తామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ