ఆగస్టు 27, మంగళవారం నాడు హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సభలో కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ నాయకులకు కళ్ళు ఎర్రబడుతున్నాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సీఎం కేసీఆర్ 24 గంటల విద్యుత్ ఇచ్చారని, నగరంలో త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత దేశమంతా తెలంగాణ వైపు చూసేలా, అవినీతి లేని పాలనను కేసీఆర్ ప్రజలకు అందిస్తున్నారని చెప్పారు. 50 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రము తెలంగాణ అని, పింఛన్ల నిమిత్తం కేంద్రం కేవలం రూ.200 కోట్ల రూపాయలు ఇస్తూంటే, ప్రభుత్వం సంవత్సరానికి రూ.12 వేల కోట్లు కేటాయిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని, దేశ వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు వేరే పార్టీల్లో చేరుతున్నారని ఎద్దేవా చేసారు. 329 బూత్ కమిటీలు, బస్తీ కమిటీలు వేసి సభ్యత్వ నమోదులో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హైదరాబాద్ లో మొదటిస్థానంలో నిలిచారని చెప్పారు.
[subscribe]
[youtube_video videoid=40iHNbUhgK8]