తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ముమ్మురం చేసింది. విచారణలో భాగంగా పేపర్ లీకేజీకి సంబంధించి ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో గ్రూప్-1 సహా మొత్తం 6 పరీక్షలకు సంబంధించిన మాస్టర్ ప్రశ్నపత్రాలను నిందితులు లీక్ చేశారు. అలాగే వీటితో పాటుగా ఆన్సర్ షీట్లను కూడా కాపీ చేసుకున్నట్లు సిట్ విచారణలో తెలిసింది. దీంతో టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, ఏఈ, ఏఈఈ, జేఎల్, టౌన్ ప్లానింగ్, డిస్ట్రిక్ట్ అకౌంట్స్ విభాగాల్లో మొత్తం 15 పేపర్లు లీక్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు నిందితులు దీనికి సంబంధించి కీలక వివరాలు వెల్లడించినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు.
కాగా కస్టోడియన్ సిస్టమ్ నుంచి ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్ మరియు రాజశేఖర్ రెడ్డిలు 6 పరీక్షలకు సంబంధించిన 15 ప్రశ్నపత్రాలను, వాటి సమాధానాలను కాపీ చేసుకున్నారని, పరీక్షలకు వారం ముందే డీల్ కుదుర్చుకున్న వారికి ఆ ప్రశ్నపత్రాలు అందించేలా ప్లాన్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గ్రూప్-1లో 100కి పైగా మార్కులు తెచ్చుకున్న రమేశ్, సురేశ్, షమీమ్లకు పరీక్షకు వారం ముందే ప్రశ్నపత్రం అందించినట్లు విచారణలో వెల్లడించారు. ఈ ముగ్గురు వాటిని జిరాక్స్ కాపీలు తీసుకొని, సమాధానాలను బట్టీ పట్టి పరీక్షలు రాసినట్లు సిట్ విచారణలో వెలుగుచూసింది. ఇక ఇప్పటికే ఈ ప్రశ్నపత్రాలు, సమాధానాల కాపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు తెలిపిన అంశాలపై ధ్రువీకరణ కోసం కస్టోడియన్ శంకర లక్ష్మిని కూడా సిట్ విచారించి పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టారు. అలాగే పరీక్ష పత్రం లీకేజిలో ఇతర నిందితుల వాట్సాప్, కాల్ డాటాను కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE