కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి పదిగంటల వరకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శ్రీమతి శాంతి కుమారి, రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు చేస్తున్న కృషిని మరింత అంకితభావంతో కొనసాగిస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. రోగులకు వైద్యం అందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల అండగా ఉంటుందని చెప్పారు. వ్యాధి లక్షణాలున్న ఏ ఒక్కరినీ వదలకుండా పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తామని, వ్యాధి సోకిన వారు కలిసిన ప్రతీ ఒక్కరినీ గుర్తించి క్వారంటైన్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
‘‘కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే విషయంలో, వ్యాధి సోకిన వారికి వైద్యం అందించే విషయంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గొప్ప సేవలు అందిస్తున్నారు. వారి భద్రతలకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. వారి ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పరీక్షలకు, వైద్యానికి వస్తున్న వారికి సరిపడినంతగా టెస్ట్ కిట్స్, పిపిఇలు, మాస్కులు, ఇతర మందులు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో పేషంట్ల సంఖ్య పెరిగినా, అందుకు అనుగుణంగా మాస్కులు, పిపిఇలు సేకరిస్తామని” సీఎం కేసీఆర్ ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. సిఎంఆర్ఎఫ్ కు వస్తున్న విరాళాలను కూడా వైద్య సిబ్బందికి అవసరమైన మాస్కులు, పిపిఇలు, మందుల కొనుగోలుకు వాడాలని కోరారు. భవిష్యత్తులో రోగుల సంఖ్య పెరిగినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.