తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 9, గురువారం నుంచి రాష్ట్రంలో కిలోమీటర్ల వారీగా డీజిల్ సెస్ విధించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో మరోసారి చార్జీలు పెరిగి ప్రయాణికులపై భారం పడనుంది. డీజిల్ ధర అసాధారణంగా పెరిగిపోవడంతో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అదనపు డీజిల్ సెస్ విధించడం అనివార్యంగా మారిందని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వైస్ చైర్మన్ అండ్ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అదనపు డీజిల్ సెస్ విధింపు ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణీకులకు ఎక్కువగా మరియు తక్కువ దూరం ప్రయాణించే ప్రయాణీకులకు తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రయాణికులు ప్రయాణించే దూరాన్ని బట్టి, జిల్లాల్లోని అన్ని రకాల సర్వీసులు మరియు సుదూర సర్వీసుల్లో డీజిల్ సెస్ను రూ.5/- మరియు అంతకంటే ఎక్కువ స్లాబ్లలో టీఎస్ఆర్టీసీ అమలు చేస్తుందని అన్నారు. సవరించిన ఛార్జీలు జూన్ 9వ తేదీ నుండే అమలులోకి వస్తాయన్నారు. పల్లెవెలుగు సర్వీసుల విషయానికొస్తే, తక్కువ దూర ప్రయాణీకులపై భారం పడకుండా ఉండేందుకు కనీస ధర రూ.10/-లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ను పెంచకపోవడంతో సిటీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం ఉందన్నారు.
మరోవైపు విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మరియు కళాశాలలకు వెళ్లేందుకు టీఎస్ఆర్టీసీ నుండి సబ్సిడీ బస్ పాస్లను పొందుతారని, పెరిగిన డీజిల్ ధరను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రస్తుతం స్టూడెంట్స్ బస్ పాస్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. చివరిగా 2019 సంవత్సరంలో బస్ పాస్ ధర స్వల్పంగా పెరిగిందని, డీజిల్ ధర పలు రెట్లు పెరిగినా దాదాపు మూడేళ్లుగా బస్పాస్ చార్జీలు పెంచలేదని అన్నారు. ఇక తమ టిక్కెట్లను ముందుగా రిజర్వ్ చేసుకున్న ప్రయాణీకులకు సవరించిన ఛార్జీలు విధించబడవని మరియు ఛార్జీలలో వ్యత్యాసం వసూలు చేయబడదని చెప్పారు. ముందుగా నిర్ణయించిన ధరలతో జారీ చేయబడిన బస్ పాస్లు పాత ధరల చెల్లుబాటు గడువు ముగిసే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని తెలిపారు.
టీఎస్ఆర్టీసీ 30 లక్షలకు పైగా ప్రయాణికులను మరియు సుమారు 12 లక్షల మంది విద్యార్థులను కలిపి దాదాపు 42 లక్షల మంది ప్రయాణికులను ప్రతిరోజూ తెలంగాణ మరియు పొరుగు రాష్ట్రాలకు వివిధ గమ్యస్థానాలకు చేరవేస్తుందని చెప్పారు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ దాదాపు 6 లక్షల లీటర్ల డీజిల్ను ఉపయోగిస్తాయని మరియు బల్క్ హెచ్ఎస్డి ఆయిల్ ధర డిసెంబర్ 2021లో లీటరుకు రూ. 84.75 ఉండగా, మార్చి 2022లో లీటరుకు రూ.118.73కి పెరిగిందన్నారు. ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయి, డీజిల్ ధర అసాధారణంగా పెరిగిపోవడంతో ప్రతిరోజు దాదాపు రూ.5 కోట్ల మేర నష్టాన్ని చవిచూస్తున్న టీఎస్ఆర్టీసీపై పెరిగిన ఇంధన ధర భారీ ఆర్థిక భారాన్ని మోపిందని, ఈ క్రమంలోనే బస్సుల్లో అదనపు డీజిల్ సెస్ విధించడం అనివార్యంగా మారిందని పేర్కొన్నారు.
అదనపు డీజిల్ సెస్ అమలు:
- పల్లెవెలుగు – రూ.5 నుంచి రూ.45 – 250 కి.మీ.లకు
- ఎక్స్ప్రెస్ – రూ.5 నుంచి రూ.90 – 500 కి.మీ.లకు
- డీలక్స్ – రూ.5 నుంచి రూ.125 – 500 కి.మీ.లకు
- సూపర్ లగ్జరీ – రూ.10 నుంచి రూ.130 – 500 కి.మీ.లకు
- ఏసీ సర్వీసులు – రూ.10 నుంచి రూ.170 – 500 కి.మీ.లకు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY