తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 40 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో మనోవేదనకు గురై పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆత్మహత్యాయత్నం చేసారు. నవంబర్ 13, బుధవారం తెల్లవారుజామున మహబూబాబాద్ డిపోకు చెందిన మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 2007 నుంచి ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న ఆవుల నరేష్ ఈ రోజు ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిగా, చికిత్స పొందుతూ నరేష్ ప్రాణాలు విడిచాడు. డ్రైవర్ నరేష్కు భార్య పోలమ్మ, ఇద్దరు పిల్లలు శ్రీకాంత్, సాయికిరణ్ ఉన్నారు.
నరేష్ ఆత్మహత్య వార్త తెలిసిన వెంటనే ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్ష నాయకులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే కార్మికులతో చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె నేపథ్యంలో ఆర్థికపరమైన ఒత్తిడిలు తట్టుకోలేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. అనంతరం నరేష్ మృతదేహంతో ఆర్టీసీ కార్మికులు, నాయకులు ర్యాలీ నిర్వహించారు. మృతదేహంతో బస్ డిపోలోకి చొచ్చుకెళ్ళేందుకు కార్మికులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బస్ డిపో ఎదుట ధర్నా చేస్తూ, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు.
[subscribe]