తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఏడవ రోజు కూడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మెకు వివిధ పార్టీల మద్దతు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతో కలిసి ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో భేటీ అయ్యారు. బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులను, సమ్మెకు మద్దతిచ్చే పార్టీ ప్రతినిది వర్గ నాయకులకు లక్ష్మణ్ సాదరంగా స్వాగతం పలికారు. సమ్మెకు మద్దతు, భవిష్యత్ కార్యాచరణ, డిమాండ్ల పరిష్కారం, ఉద్యోగ సంఘాల మద్దతు వంటి అనేక అంశాలపై లక్ష్మణ్ తో చర్చించారు.
లక్ష్మణ్తో భేటీ అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 12, శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ముందు కుటుంబ సభ్యులతో కలిసి మౌన దీక్ష నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మెకు మద్దతిచ్చి, డిమాండ్ల కోసం చేసే పోరాటంలో బాగస్వామ్యమవుతామని లక్ష్మణ్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవోల మద్దతు కూడ ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. ఆర్టీసీని పూర్తిగా దోచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ప్రజా రవాణావ్యవస్థను కాపాడుకునేందుకు ప్రజలు కూడ సహకారం అందించాలని కోరారు.
[subscribe]