ప్రముఖ తెలుగు నటుడు, మాజీ కేంద్ర మంత్రి, రెబల్స్టార్ కృష్ణంరాజుకి అభిమానులలు తుది వీడ్కోలు చెప్పారు. కుటుంబ సభ్యులు, అభిమానులు అశ్రునయనాలతో వెంట రాగా హైదరాబాద్లోని మొయినాబాద్ వద్ద కనకమామిడి ఫాంహౌస్లో ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కృష్ణంరాజు మృతిపై విడుదల చేసిన ప్రకటనలో.. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ, అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కృష్ణంరాజు అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. దీనికి ముందుగా జూబ్లీహిల్స్లోని నివాసంలో ఆయన భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.
అలాగే తమ అభిమాన కథానాయకుడిని చివరిసారిగా చూసేందుకు అభిమానులు కృష్ణంరాజు ఇంటివద్దకు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో ముందుగా జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర బీఎన్ఆర్ కాలనీ బ్రిడ్జ్, గచ్చిబౌలి, అప్పా జంక్షన్ మీదుగా మొయినాబాద్ చేరుకుంది. అనంతరం పోలీసులు కృష్ణంరాజు భౌతికకాయానికి గౌరవసూచకంగా గాల్లోకి మూడుసార్లు కాల్చి గన్ సెల్యూట్ చేశారు. టాలీవుడ్ అగ్రహీరో, ఆయన వారసుడు ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా కృష్ణంరాజుకి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY