వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ బావిలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసును వరంగల్ పోలీసులు ఆరు బృందాలను రంగంలోకి దింపి సత్వర విచారణ చేపట్టి మిస్టరీని ఛేదించారు. బీహార్ కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్ ఈ కేసులో కీలక నిందితుడుగా పోలీసులు వెల్లడించారు. నిందితుడు సంజయ్ ను మే 25, సోమవారం మీడియా ముందు ప్రవేశ పెట్టి, వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మక్సూద్ కుటుంబంతో పాటు మరో ఐదుగురిని మొత్తం పది మందిని సంజయ్ కుమార్ దారుణంగా హత్య చేశాడని సీపీ రవీందర్ నిర్ధారించారు.
“గోనె సంచులు తయారు చేసే కేంద్రంలో మక్సూద్, అతడి భార్య పనిచేసేవారు. నాలుగు సంవత్సరాల క్రితం బిహార్కు చెందిన సంజీవ్ కుమార్ యాదవ్కు ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మక్సూద్ భార్య నిషా అక్క కూతురు రఫీకాతో సంజయ్ కు పరిచయం ఏర్పడడం, అది వివాహేతర సంబంధంగా మారి వారిద్దరూ కలిసి సహజీవనం సాగించారు. ఈ క్రమంలో తన కుమార్తెతో కూడా చనువుగా ఉండడాన్ని రఫీకా గమనించి సంజయ్ను నిలదీయడంతో, వారి మధ్య పలుమార్లు గొడవ జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, తన కుమార్తెతో సన్నిహితంగా ఉండడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఫీకా హెచ్చరించడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. రఫీకాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో పాటుగా రఫీకాని తీసుకుని మార్చి 6న సంజయ్ విశాఖ వైపు వెళ్లే గరీభ్ రథ్ రైలు ఎక్కాడు. ప్రయాణ సమయంలో మజ్జిగ ప్యాకెట్లలో నిద్రమాత్రలు కలిపి ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు రైలు నుంచి తోసేశాడు. అనంతరం తిరిగి గీసుకొండ చేరుకున్నాక, తన అక్క కూతురు గురించి మక్సూద్ భార్య నిషా నిలదీసింది. ఆమె కనబడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పింది. దీంతో మక్సూద్ కుటుంబాన్ని కూడా హతమార్చాలని సంజయ్ టార్గెట్ పెట్టుకున్నాడని” సీపీ తెలిపారు.
“ఈ నెల 16వ నుంచి 20వ తేదీ వరకు రోజూ మక్సూద్ కుటుంబం పనిచేసే గోనె సంచుల తయారీ కేంద్రాన్ని సందర్శించాడు. ఈనెల 20 తేదీన మక్సూద్ పెద్ద కుమారుడి పుట్టిన రోజు కావడంతో వారందరినీ ఆ రోజే హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. వరంగల్ చౌరస్తాలో ఓ మెడికల్ షాపులో సుమారు 60 నిద్రమాత్రలు కొన్నాడు. ఆ రోజు వారిని కలిసి ముచ్చటించి, వాళ్లు వండుకున్న భోజనంలో, కూల్ డ్రింక్లో ఎవరికీ తెలియకుండా వాటిని కలిపాడు. తను అక్కడికి వచ్చాడనే విషయం తెలిసిన బీహార్ కు చెందిన శ్రీరాం, శ్యాం తినే ఆహారంలో కూడా నిద్రమాత్రలు కలిపాడు. నిద్ర మాత్రల మత్తుతో వాళ్లంతా నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య వరకు మత్తులో ఉన్నవారిని గోనె సంచిలో పెట్టి గోదాం పక్కనే ఉన్న బావిలో పడేసి ఇంటికి వెళ్ళిపోయాడు. గొనె సంచుల గోదాం మరియు గొర్రెకుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను ఆధారంగా చేసుకుని ఈ కేసు దర్యాప్తు చేశాం. సంజయ్ ఇంట్లోంచి వెళ్లడం దగ్గర నుంచి మళ్లీ చేరుకునే వరకు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. నిందితుడు సంజయ్ చేసింది చాలా ఘోరమైన చర్య. కస్టడీకి తీసుకుని పూర్తీ వివరాలు రాబట్టి, అతనికి తప్పకుండా కఠిన శిక్ష పడేలా చూస్తామని” వరంగల్ సీపీ రవీందర్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu