- ఏపీలో ఎన్నికలకు మరికొద్ది రోజులే ఉండటంతో.. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ హోరా హోరీగా తల పడుతున్నాయి. ప్రతీ స్థానంలోనూ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటూ అభ్యర్దులు తమ ప్రయత్నాలను ముమ్మురం చేస్తున్నారు. అయితే ఓటర్లే ఇప్పుడు అభ్యర్ధుల పాలిట దేవుళ్లు కాబట్టి వారిని ఎన్నడూ లేనంతగా తమ వైపు తిప్పుకోవడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఏపీలో ఓటు హక్కు కలిగినవాళ్లు హైదరాబాద్ లో ఉండటంతో వారిని ప్రసన్నులుగా చేసుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఇప్పుడు ఇలా హైదరాబాద్ లో స్థిరపడ్డ ఓటర్లపై గురిపెట్టారు. ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించబోతున్న ఈ ఓటర్లను ఆకట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమ తమ నియోజకవర్గంలోని ఓటర్లతో హైదరాబాద్ లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ.. విందు భోజనాలు ఏర్పాటు చేస్తూ తమకే ఓటు వేయాలని వేడుకుంటున్నారు.
దీనికోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన అభ్యర్థుల టీమ్లు హైదరాబాద్ లో పని చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల పరిధిలో ఏపీకి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో వారి మద్దతును కూడగట్టుకోవడానికి అక్కడ ప్రచారాలతో పాటు ఇక్కడ కూడా కాస్త సమయం కేటాయిస్తున్న అభ్యర్దులు, ముఖ్య నేతలు..ఇక్కడి ఓటర్లను కలుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని రాజానగరం నియోజకవర్గానికి చెందిన ఓటర్లకు.. తాజాగా మియాపూర్లోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్లో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీల నేతలు ఆ ప్రాంతంలోని ఓటర్లతో మాట్లాడి.. కూటమికి ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ అభ్యర్థి కూడా హైదరాబాద్ లో ఉంటున్న తమ నియోజకవర్గ ఓటర్లకు ప్రముఖ హోటల్లో స్పెషల్ విందు ఏర్పాటు చేశారు.
ఇలా చాలా చోట్ల హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు ఏపీ ఓటర్లతో కిటకిటలాడడుతున్నాయి. అంతేకాదు ఓటేయడానికి వచ్చే ఓటర్లకు రాను, పోను బస్ చార్జీలను అందిస్తామని, అవసరమైతే వాహనాలు కూడా తామే ఏర్పాటు చేస్తామని వారి తరుపున పని చేస్తున్న టీమ్స్ చెబుతున్నారు.
ఇప్పటికే ఏపీలోని వివిధ జిల్లాలకు చెందినవారి ఫోన్ నంబర్లు, అడ్రస్లను ఈ బృందాలు సేకరించాయి. వారికి ఫోన్కాల్స్, వాట్సాప్ ద్వారా సిటీలోని కన్వెన్షన్ సెంటర్లు, ఫంక్షన్స్ హాల్స్, వివిధ హోటళ్లలో మీటింగ్స్ కోసం వారిని ఆహ్వానిస్తున్నారు. ఏపీలో ఓటున్న వారంతా ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా భావిస్తున్న అభ్యర్ధులను.. వీరిని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY