టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం చేసిన భూసేకరణను వైసీపీ ప్రభుత్వం కుంభకోణంగా మార్చిందంటూ విమర్శించారు. ఈ అంశంపై ట్విట్టర్ లో స్పందిస్తూ ఆయన వరుస ట్వీట్స్ చేశారు. “పేదల కోసం తెలుగుదేశం ప్రభుత్వం 29.52 లక్షల ఇళ్ళు మంజూరు చేసింది. 9.10లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి 3 దశల్లో 8 లక్షల గృహప్రవేశాలు చేయించింది. మరో 20.41 లక్షల ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. తెలుగుదేశం “సామూహిక గృహ ప్రవేశాలు” దేశానికే నమూనా అయ్యింది. మరో 4.02 లక్షల మందికి 7,475 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసాం. విశాఖ సహా ఉత్తరాంధ్రలో, రాయలసీమలో లక్షలాది మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం. గత ఏడాదిగా ఇళ్ల పనులన్నీ ఆపేశారు. తెలుగుదేశంపై అక్కసుతో పూర్తైన ఇళ్లు లబ్దిదారులకు ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నారని” చంద్రబాబు అన్నారు.
“తెలుగుదేశం కట్టిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు. వైసీపీ పాలనలో పేదల ఇళ్లస్థలాలకోసమంటూ భూసేకరణను కుంభకోణంగా మార్చారు. ఎకరా రూ.7 లక్షల విలువచేయని భూములను రూ.45 నుంచి రూ.70 లక్షలకు ప్రభుత్వంతో కొనిపించి, వైసీపీ నాయకులు దోపిడీకి పాల్పడ్డారు. పేదలకు ఇళ్లస్థలాల పేరుతో ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల స్కామ్ లు చేసారు. ఆవభూముల్లోనే రూ400కోట్ల కుంభకోణం చేశారని నిజనిర్దారణ కమిటి పేర్కొంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు పేదల నుంచి వసూళ్ల దందాకు వైసీపీ తెరలేపింది. ఇళ్ల స్థలం కావాలంటే రూ 30 వేలు, రూ 60 వేలు, రూ లక్షన్నర చొప్పున రేట్లు నిర్ణయించి వసూళ్ల దందా ప్రారంభించారు. గ్రామానికో రేటు, దగ్గర అయితే ఒక రేటు, దూరం అయితే ఇంకో రేటు వసూలు చేస్తున్నారు. పేదల సంక్షేమంలోనూ దోపిడీకి పాల్పడిన చరిత్ర వైసీపీదేనని” చంద్రబాబు విమర్శించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu