వివిధ శాఖలలో ఉపాధి హామీ పనుల అనుసంధానంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జూన్ 4, గురువారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడం కోసం కేటాయించిన నిధులతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను అనుసంధానం చేయటానికి తగు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలలో చేపట్టే పనుల గుర్తింపుతో పాటు, ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టడానికి సీజనల్ క్యాలెండర్ ను రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలు అధిక నిధులు పొందేలా గ్రామాలలో పెద్ద ఎత్తున ఉపాధి హామి పనులు చేపట్టి గ్రామీణ యువతకు ఉపాధి కలిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారని సీఎస్ తెలిపారు.
ఉపాధి హామీ, వివిధ శాఖలకు కేటాయించిన నిధులతో ప్రభుత్వ ప్రాధాన్య పనులైన వైకుంఠధామాలు, డంప్ యార్డులు, రైతు వేదికలు, కలములు, గ్రామీణ పార్కులు, గొర్రె-పశువుల షెడ్ల నిర్మాణాల పనులతో పాటు ఫీడర్ చానళ్లు, ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీల డీసెల్టింగ్, హౌసింగ్ కాలనీలలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పనులు చేపట్టడంపై దృష్టి సారించాలన్నారు. ఉపాధి హామీ పనులలో వివిధ శాఖలు యాక్టివ్ రోల్ పాటించాలన్నారు. వివిధ పనులకు సంబంధించి స్టాండడ్ డిజైన్స్–ఎస్టిమేట్స్ రూపొందించాలని గ్రామ, మండల, జిల్లాల వారిగా ప్రణాళికలు తయారు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu