ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమల్లో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రభుత్వ సేవలను నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం పేర్కొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇకపై పది రోజుల్లోనే రేషన్ కార్డులు మంజూరు చేసి బియ్యం అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే 10 రోజుల్లో పింఛన్ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలు ఇస్తామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ కాలపరిమితిలోనే దరఖాస్తులను పరిశీలించి అర్హులకు వారి ఇంటి వద్దే గ్రామ, వార్డు వాలంటీర్లు అందజేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పింఛన్ల లబ్ధిదారుల సంఖ్యను 44 లక్షల నుంచి 58 లక్షలకుపైగా పెంచామని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి, వివక్షకు తావులేకుండా నూటికి నూరుశాతం సంతృప్త స్థాయిలో పథకాలు అమలు జరుగుతాయని అన్నారు. పథకాల అమలుపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu