దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ క్రమంలో పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను జారీ చేసింది. కార్యాలయాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేలా ఈ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాటించాల్సిన మార్గదర్శకాలు:
- ఎలాంటి కరోనా లక్షణాలు లేని సిబ్బందిని మాత్రమే అనుమతించాలి. ఎవరికైనా తేలికపాటి దగ్గు లేదా జ్వరం ఉన్న కూడా ఇంట్లో ఉండాలి.
- కంటైన్మెంట్ జోన్లో నివసించే అధికారులు / సిబ్బంది కార్యాలయానికి రాకూడదు. కంటైన్మెంట్ డి-నోటిఫికేషన్ వచ్చేవరకు ఇంటి నుండి మాత్రమే పనిచేయాలి.
- ఒక రోజులో 20 కంటే ఎక్కువ మంది సిబ్బంది / అధికారులు కార్యాలయానికి హాజరు కాకూడదు. రోస్టర్ విధానానికి అనుగుణంగా హాజరుకావాలి. మిగిలిన సిబ్బంది ఇంటి నుండి పని చేయాలి.
- సెక్రటరీలు/డిప్యూటీ సెక్రటరీలు క్యాబిన్ పంచుకుంటే వారు భౌతిక దూరాన్ని పాటించాలి.
- ఏ విభాగంలోనైనా ఒకేసారి ఇద్దరు అధికారులు ఉండకూడదు, కార్యాలయంలో ఏ సమయంలోనైనా 20 మందికి మించకుండా సిబ్బంది ఉండేలా కార్యాలయంలో ఏర్పాట్లు చేసుకోవాలి. గదులలో సరైన వెంటిలేషన్ ఉండేలా వీలైనంతవరకు కిటికీలు తెరిచి ఉంచవచ్చు.
- కార్యాలయ ప్రాంగణంలో అన్ని సమయాల్లో ఫేస్ మాస్క్ మరియు ఫేస్ షీల్డ్ ధరించాలి. కార్యాలయంలో మాస్కు ధరించే ప్రోటోకాల్ పాటించలేదని తేలితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.
- ఉపయోగించిన మాస్క్ మరియు గ్లోవ్స్ ను పసుపు రంగు బయో మెడికల్ వేస్ట్ బిన్లో మాత్రమే జాగ్రత్తగా వేయాలి, ఈ నిబంధనను ఉల్లంఘించే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి.
- ఫేస్ టూ ఫేస్ మీటింగ్స్, డిస్కషన్స్ లాంటివి వీడియో కాన్ఫరెన్స్, ఫోన్ ద్వారా పెట్టుకోవాలి.
- కరోనా సంక్రమణ జరగకుండా ఉండటానికి ప్రతి అరగంటకి ఓసారి చేతులు కడుక్కోవడం తప్పనిసరి. కారిడార్లలోని ప్రముఖ ప్రదేశాలలో హ్యాండ్ సానిటైజింగ్ డిస్పెన్సర్లను ఏర్పాటు చేయాలి.
- ఎలక్ట్రిక్ స్విచ్లు, డోర్ నాబ్స్, ఎలివేటర్ బటన్లు, హ్యాండ్ రైల్స్, వాష్రూమ్ ఫిక్చర్స్ వంటి తరచుగా తాకే ప్రదేశాలను ప్రతి గంటకొకసారి 1% సోడియం హైపోక్లోరైట్తో ద్రావణంతో శుభ్రం చేయాలి. అధికారులు / సిబ్బంది తమకు సంబంధించిన పరికరాలైన కీబోర్డులు, మౌస్, ఫోన్లు, ఎసి రిమోట్లు మొదలైన వాటిని ఏదైనా ఇథనాల్ ఆధారిత డిసిన్ఫెక్ట్స్ ఉపయోగించి తరచుగా శుభ్రం చేసుకోవాలి.
- కూర్చున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు ఒక మీటర్ దూరం పాటించాలి. అధికారుల క్యాబిన్లలోని విజిటర్స్ కుర్చీలను భౌతిక దూరం నిబంధనలను పాటిస్తూ ఏర్పాటుచేయాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu