తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో 92,86,577 మంది ఓటర్ల వివరాల్లో స్పష్టత అవసరమని ఎన్నికల అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేసి, సరైన ఆధారాలు సమర్పించేందుకు అవకాశం కల్పించనున్నారు.
ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్రెడ్డి సోమవారం SIR ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. ఓటర్ల వివరాలను గత రికార్డులతో అనుసంధానం చేసే సమయంలో వివిధ రకాల వ్యత్యాసాలు గుర్తించినట్లు తెలిపారు.
60.50 లక్షల మంది అనామలీస్ జాబితాలో
ఓటరు పేరు, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా వంటి వివరాల్లో గత రికార్డులతో సరిపోలని అంశాలు గుర్తించిన 60,50,918 మందిని ‘అనామలీస్’ కేటగిరీలో చేర్చారు.
అదేవిధంగా ఎన్యూమరేషన్ ఫారాల్లో అవసరమైన మూడు కాలమ్లను పూర్తిగా నింపకపోవడం లేదా వివరాలను సమగ్రంగా నమోదు చేయని 32,36,659 మంది ఓటర్లను కూడా గుర్తించారు.
ఈ రెండు కేటగిరీల్లో ఉన్న వారికి నోటీసులు అందించి, తగిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించే అవకాశం ఇవ్వనున్నారు. ఆధారాలు పరిశీలించిన అనంతరం అర్హత ఉన్నవారి పేర్లను తుది ఓటరు జాబితాలో కొనసాగిస్తారు.
3.38 కోట్లకుపైగా ఓటర్లు
తెలంగాణలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,64,87,213 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు.
ఈ నెల 10వ తేదీ వరకు పూర్తయిన ఫారాల డిజిటలైజేషన్ ప్రకారం.. ఫారాలు సమర్పించని 73.39 లక్షల మంది ఓటర్లను మరో కేటగిరీలో గుర్తించారు.
వీరిలో శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారు 45,18,963 మంది, మరణించినవారు 9,22,229 మంది, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదైనవారు 6,70,203 మంది ఉన్నారు.
ఇక నమోదిత చిరునామాలో లేకపోవడం లేదా బూత్ లెవల్ అధికారులు ఇంటికి వెళ్లిన సమయంలో అందుబాటులో లేకపోవడంతో మరో 11,25,546 మంది నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు పొందలేకపోయారు. వీరికి కూడా మరో అవకాశం కల్పించనున్నట్లు సీఈవో తెలిపారు.
నోటీసు లేకుండా పేరు తొలగించరు
ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత గత SIR రికార్డులతో వివరాలు సరిపోలని కేసులను సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ERO) పరిశీలిస్తారు.
అవసరమైతే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తారు. అయితే నోటీసు ఇవ్వకుండా ముసాయిదా జాబితాలో ఉన్న ఓటరు పేరును నేరుగా తొలగించడానికి వీలుండదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
పరిశీలనకు సంబంధించిన జాబితాలను సంబంధిత కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాలు, జిల్లా ఎన్నికల అధికారి వెబ్సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు.
ఆధారాల సమర్పణకు సెప్టెంబర్ 16 వరకు అవకాశం
నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వివరాలను ధ్రువీకరించేందుకు అవసరమైన పత్రాలను ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు సమర్పించవచ్చు.
పేరు, ఫొటో, చిరునామా లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు ఉంటే వాటి సవరణకు తగిన ఆధారాలను అందించాలి. ఇందుకోసం ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు వంటి పత్రాలను ఉపయోగించవచ్చు.
ERO నిర్ణయంపై అభ్యంతరం ఉన్నవారు 15 రోజుల్లో జిల్లా మేజిస్ట్రేట్కు అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడి నిర్ణయంపై కూడా అసంతృప్తి ఉంటే, ఆ ఆదేశం వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఆశ్రయించే అవకాశం ఉంటుంది.
ఫారం-6, 6ఏ, 7, 8 దేనికి?
ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హులైన వారు ఫారం-6 ద్వారా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే యువత కూడా ఇదే ప్రక్రియను ఉపయోగించుకోవచ్చు.
విదేశాల్లో నివసించే భారతీయులు ఓటరు నమోదుకు ఫారం-6ఏ సమర్పించాలి.
ఓటరు జాబితాలోని పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడం లేదా అనర్హమైన పేరును తొలగించాలని కోరడం కోసం ఫారం-7 ఉపయోగించాలి.
చిరునామా మార్పు, వివరాల సవరణ, కొత్త EPIC కార్డు కోసం దరఖాస్తు, PwD ఓటరుగా గుర్తింపు వంటి సేవలకు ఫారం-8 సమర్పించవచ్చు.
ఈ దరఖాస్తులను ERO, AERO, BLOలకు నేరుగా ఇవ్వడంతో పాటు ఎన్నికల సంఘం సంబంధిత ఆన్లైన్ వేదికల ద్వారా కూడా సమర్పించే అవకాశం ఉంది.
అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ అనంతరం వాటిని పరిశీలించి అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, గైర్హాజరైనవారు, డూప్లికేట్ ఓటర్లకు సంబంధించిన వివరాలను కూడా బూత్ల వారీగా ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచనున్నారు.
ఈ జాబితాలను ERO, AERO కార్యాలయాలతో పాటు గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల నోటీసు బోర్డులపై ప్రదర్శించనున్నారు.
ఆన్లైన్లోనూ ఓటరు జాబితా పరిశీలన
ముసాయిదా ఓటరు జాబితాను BLOల వద్ద, ERO, AERO కార్యాలయాల్లో పరిశీలించవచ్చు. అలాగే రాష్ట్ర CEO వెబ్సైట్, ECI సంబంధిత మొబైల్ యాప్, ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా కూడా వివరాలను తెలుసుకోవచ్చు.
జాబితాలో పేరు లేకపోయినా, వ్యక్తిగత వివరాల్లో తప్పులున్నా సంబంధిత BLOను సంప్రదించాలని అధికారులు సూచించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు: సుదర్శన్రెడ్డి
అర్హత ఉన్న ప్రతి వ్యక్తి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఈవో సుదర్శన్రెడ్డి తెలిపారు. ‘ఒక వ్యక్తికి ఒకే ఓటు’ అనే లక్ష్యంతో SIR ప్రక్రియను కొనసాగిస్తున్నామని చెప్పారు.
వివరాలు పూర్తిగా లేని ఓటర్లకు ఇంటింటికీ వెళ్లి నోటీసులు అందిస్తామని తెలిపారు. ప్రజలకు సహాయం చేసేందుకు రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 1950 టోల్ఫ్రీ హెల్ప్లైన్ కూడా అందుబాటులో ఉందని చెప్పారు.
33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో SIR
తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో SIR ప్రక్రియ చేపట్టారు. ఈ కార్యక్రమంలో 119 మంది EROలు, 892 మంది AEROలు, 3,590 మంది BLO సూపర్వైజర్లు, 35,985 మంది BLOలు పనిచేస్తున్నట్లు సీఈవో వివరించారు.
ముసాయిదా ఓటరు జాబితా విడుదల సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సుదర్శన్రెడ్డి సమావేశమయ్యారు. సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి పులిపాటి రాజేశ్, బీజేపీ నుంచి మర్రి శశిధర్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్కుమార్ హాజరయ్యారు.









































