ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేరళకు వెళ్లనున్నారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్స, విశ్రాంతి కోసం కేరళలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ తీసుకోనున్నట్లు సమాచారం.
ముంబైలో భుజానికి శస్త్రచికిత్స
గత నెలలో ముంబైలోని ఓ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఆపరేషన్ అనంతరం కొంతకాలం పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. అయితే, శస్త్రచికిత్స అనంతరం కూడా ఆయన వరుసగా సమీక్షా సమావేశాలు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. దీంతో భుజం భాగంలో వాపు, నొప్పి పెరిగినట్లు సమాచారం.
కేరళలో ప్రత్యేక ఆయుర్వేద చికిత్స
ఈ నేపథ్యంలో భుజం పూర్తిస్థాయిలో కోలుకునేందుకు వైద్యుల సూచన మేరకు కేరళలోని ప్రముఖ ఆయుర్వేద వైద్యాలయంలో ప్రత్యేక చికిత్స తీసుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. చికిత్సతో పాటు అవసరమైన విశ్రాంతి తీసుకుని భుజాన్ని పూర్తిగా కోలుకునేలా చూడనున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొంతకాలం విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అనంతరం సాధారణ రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.







































