నల్లమల అడవుల్లో యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా చేపడుతున్న ‘సేవ్ నల్లమల’ ఉద్యమానికి పలు వర్గాల నుంచి భారీ ఎత్తున స్పందన లభిస్తుంది. ప్రకృతి సంపదలో భాగమైన నల్లమల అడవులను కాపాడుకుందామని ప్రముఖ సినీనటులు, రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు, పారిశ్రామికవేత్తలు స్పందిస్తున్నారు. యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా change.org వెబ్ సైట్ లో ‘సేవ్ నల్లమల-స్టాప్ యురేనియం మైనింగ్’ పేరుతో పిటిషన్ పై సంతకాలు సేకరిస్తున్నారు. సినీ నటులు మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్, రామ్, వరుణ్ తేజ్, అడవి శేష్, విజయ్ దేవర కొండా తో పాటు పలువురు ఈ ఉద్యమం పై స్పందించి ప్రభుత్వాన్ని ఈ నిర్ణయం మానుకోవాలని కోరారు. మరో వైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ యురేనియం తవ్వకాలని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తవ్వకాల వలన పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుందని, నల్లమల అడవుల పరిరక్షణ కోసం జనసేన మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.
సోషల్ మీడియాలో పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో ఈ ఆందోళనపై రాష్ట్ర మునిసిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. యురేనియం త్రవ్వకాల అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తో వ్యక్తిగతంగా చర్చిస్తానని ఆయన ట్విట్టర్ లో తెలియజేసారు. దీనికి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ నల్లమల అడవుల్లో యురేనియం త్రవ్వకాలకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలనీ కేటీఆర్ ను కోరారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ యురేనియం త్రవ్వకాల వ్యతిరేక కమిటీ ఛైర్మన్ గా వి.హనుమంతురావును నియమించింది. ఈ కమిటీలో మొత్తం 16 మంది సభ్యులుంటారని, పెద్దఎత్తున ఉద్యమించి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేస్తూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు.
[subscribe]
[youtube_video videoid=Ql6wT3MeT98]