జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో వైసీపీ 100 రోజుల పాలనపై జనసేన పార్టీ రూపొందించిన నివేదికను విడుదల చేసారు. ఈ నివేదికలో వైసీపీ ప్రభుత్వానికి పారదర్శకత,దార్శనికత లోపించాయని, వంద రోజులు పాలనా ఎటువంటి ప్రణాళికబద్ధంగా జరగలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయాత్మకంగా పని చేయాలని నివేదికలో జనసేన పార్టీ సూచించింది. 9 అంశాలపై 33 పేజీలతో కూడిన నివేదికను విడుదల చేసారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన నివేదికపై మాట్లాడారు. ఇసుక విధానం, పెట్టుబడుల ఆకర్షించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, వైసీపీ తీరు వల్ల పెట్టుబడిదారులు వెనక్కి వెళుతున్నారని, కొత్త పరిశ్రమలు రావడం లేదని చెప్పారు.
ప్రభుత్వ విధానాలు రాజధాని భవిష్యత్ ను ప్రశ్నార్ధకంగా మార్చాయని విమర్శించారు. వైసీపీ కార్యకర్తలను వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేయడానికే గ్రామ వాలంటీర్లుగా నియమించారని, టీడీపీ పార్టీని జన్మభూమి కమిటీలు దెబ్బతీసినట్టే వైసీపీ పార్టీని వాలంటీర్ల వ్యవస్థ దెబ్బతీస్తుందని చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.15 వేల పింఛన్ ఇస్తామన్నారని, మూడు నెలల్లో ఎంతమందికి పింఛన్లు అందాయో చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆపేసి రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టారని విమర్శించారు. ప్రాజెక్టులో అవినీతి జరిగిందని భావిస్తే తప్పకుండ విచారణ చేపట్టాలని కోరారు.
ఇసుక దొరక్క, పనులు లేక అనేక వేల మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కోడికత్తి నిందితుడు శ్రీనివాస్, మాజీ ఎంపీ వివేకానంద రెడ్డికి సంబంధిన కేసులలో నిర్దేశిత సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వివరాలు చెప్పకపోతే, అఖిలపక్షం ఏర్పాటు చేసి సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. మూడునెలల వైసీపీ ప్రభుత్వం సాధించిన ఘనత ఏదైనా ఉందంటే ప్రజావేదిక కూలగొట్టడమేనని ఎద్దేవా చేసారు.
[subscribe]
[youtube_video videoid=3LtgherLHJ8]