టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల శాశ్వత ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా వచ్చిన పరీక్ష పత్రాలు లీకేజి ఆరోపణలపై ప్రభుత్వం మరియు పంచాయితీ రాజ్ శాఖ స్పందించకుండా అభ్యర్థుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు. ‘ సచివాలయ ఉద్యోగ నియామకాల స్కామ్ విషయమై ప్రభుత్వంగానీ, పంచాయితీ రాజ్ శాఖగానీ ఇంతవరకు నోరిప్పలేదు. ఏపీపీఎస్సీని అడిగితే పరీక్షలను మేము నిర్వహించలేదు, మాకు సంబంధం లేదంటోంది. 18 లక్షల మంది భవిష్యత్తుతో ఏమిటీ నాటకాలు?’ అని ప్రశ్నించారు.
మరోవైపు వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు స్పందిచారు. ‘ తోలుబొమ్మలాట మధ్యలో కేతిగాళ్ళలా ఎవరెవరో వచ్చి తెదేపా ఓర్వలేకపోతుందని అంటారు. అంత ఓర్వలేకపోవడానికి మీరు చేసిన ఘనకార్యాలేమిటి? మీరు గడ్డితినడం చూసి, నీతిమాలిన పనులు చూసి అసూయపడాలా? ముందు ఈ స్కామ్ పై విచారణ చేయించండి. యువతకు మీరు చేసిన అన్యాయాన్ని సహించేదే లేదని’ వైసీపీ నాయకులను, ప్రభుత్వాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు. ఉద్యోగ నియామకాల గురించి రెండు మూడు రోజులుగా అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
[subscribe]