నల్గొండ జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. పద్మావతి రెడ్డి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలపడంతో ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఆమె 2014 లో కోదాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక 2018 డిసెంబర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కోదాడ నియోజక వర్గం నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ చేతిలో 756 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా గెలవడంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసారు. ఖాళీ అయిన ఈ స్థానానికి మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికలతో పాటు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరపనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక ఈ స్థానానికి పోటీచేసే టిఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సెప్టెంబర్ 23, సోమవారం నాడు ప్రగతి భవన్ లో శానంపూడి సైదిరెడ్డి కి కేసీఆర్ బి-ఫారం కూడ అందజేసారు. మరో వైపు బీజేపీ పార్టీ నుంచి శ్రీకళారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది.
[subscribe]