బాలీవుడ్ దిగ్గజ నటుడు, అభిమానుల ఆరాధ్య నటుడు అమితాబ్ బచ్చన్ కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఇచ్చే ఈ అత్యున్నత పురస్కారానికి గాను బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవడేకర్ మంగళవారం రాత్రి ట్విట్టర్లో ప్రకటించారు. రెండు తరాల ప్రేక్షకులను అలరింపజేసి, స్ఫూర్తిగా నిలిచిన లెజెండ్ అమితాబ్ బచ్చన్ ను దాదాసాహబ్ ఫాల్కే అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేసాం. అందుకు దేశం మరియు అంతర్జాతీయ సమాజం కూడ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది, ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అని ప్రకాష్ జవడేకర్ తెలిపారు.
1969వ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం, సినీ పరిశ్రమకు గొప్ప సేవలు అందించిన వారికి ఈ పురస్కారాన్ని అందిస్తుంది. భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోబోతున్న 50వ వ్యక్తిగా అమితాబ్ బచ్చన్ నిలిచారు. ఇప్పటివరకూ 32 మంది హిందీ సినీ ప్రముఖులకు ఈ అవార్డు వరించింది. నాలుగు దశాబ్దాలుగా తన సినీ జీవితంలో వివిధ పాత్రలు పోషించి, ఒక్కో మెట్టు ఎదుగుతూ సినిమా అభిమానులకు అత్యంత ఇష్టమైన నటుడిగా, కొత్తతరం నటులకు ప్రేరణగా నిలిచి అమితాబ్ బచ్చన్ పేరు ప్రఖ్యాతలు గడించారు. అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ ఇతర భాషల నటులతో పాటు, రాజకీయనాయకులు, క్రీడాకారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసారు.