ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం కు ఊరట లభించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉంటున్న ఆయనకు అక్టోబర్ 22, మంగళవారం నాడు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇతర ఏ కేసుల్లో అరెస్ట్ కాని పక్షంలో లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో ఆయనను విడుదల చేయవచ్చని ధర్మాసనం తెలిపింది. అవసరమైనప్పుడల్లా ఇంటరాగేషన్కు అందుబాటులో ఉండాలని చిదంబరంకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అక్టోబర్ 18, శుక్రవారం నాడు ఢిల్లీ కోర్టులో సీబీఐ ఛార్జిషీట్ నమోదు చేసింది. చిదంబరం కొడుకు కార్తీ, పీటర్ ముఖర్జీయా, ఇంద్రాణీ ముఖర్జీయా లతో పాటు మొత్తం 13 మందిని సీబీఐ నిందితులుగా పేర్కొంది.
ఆగస్టు 21న చిదంబరాన్ని అరెస్టు చేసిన సీబీఐ, విచారణ చేస్తూ జ్యూడిషయల్ కస్టడీ లో భాగంగా ఆయనను రెండు నెలలపాటు తీహార్ జైల్లో ఉంచింది. మరో వైపు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నగదు అక్రమ చలామణికి సంబంధించి అక్టోబర్ 16, బుధవారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేసారు. అక్టోబర్ 24 వరకూ చిదంబరం ఈడీ కస్టడీలోనే ఉండాల్సి ఉంటుంది. దీంతో ఆయనకు బెయిల్ లభించినప్పటికీ జుడిషియల్ కస్టడీ ముగిసేవరకు ఆయన తీహార్ జైలులోనే ఉంటారు.
[subscribe]