హైదరాబాద్లోని ఎల్బీనగర్ లో ఉన్న షైన్ ఆస్పత్రిలో అక్టోబర్ 21 సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షైన్ ఆస్పత్రి పై అంతస్తులో ఉన్న ఎన్సీఐయూలో రిఫ్రిజిరేటర్ పేలడంతో అక్కడ దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఎన్సీఐయూలో ఆరుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు స్పందించే లోపే క్షణాల్లో గది మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 4 నెలల బాలుడు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురు చిన్నారులను పక్కనే ఉన్న వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ ఆసుపత్రిలో సుమారు 45 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణ జరిపించి, 24 గంటలలోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు.
మృతి చెందిన చిన్నారి తండ్రి నరేష్ ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు ఆసుపత్రి యాజమాన్యం, విధుల్లో ఉన్న డాక్టర్లపై కేసు నమోదు చేసారు. ఆస్పత్రి ఎండీ సునీల్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ప్రమాదం జరిగిన విధానం, అనుమతులపై దర్యాప్తు జరిపి ఆసుపత్రిని సీజ్ చేసారు. షైన్ ఆస్పత్రి ఘటనపై స్పందించిన అధికారులు ప్రత్యేక బృందాలతో ఆస్పత్రుల్లో భద్రతపై విచారణ చేపట్టబోతున్నాయి. నగరంలోని ఇతర ఆస్పత్రుల్లో కూడ జీహెచ్ఎంసీ, ఫైర్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి,చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
[subscribe]