తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో సెప్టెంబర్ 15న మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును ఎట్టకేలకు వెలికితీశారు. రాయల్ వశిష్ఠ బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ధర్మాడి సత్యం బృందం, స్కూబా డ్రైవర్ల సహాయంతో ఈ ఆపరేషన్ను సక్సెస్ చేసి బోటును నీళ్లపైకి తెచ్చింది. సుమారు 300 అడుగుల లోతులో ఉన్న బోటును అడుగుభాగం నుంచి రోప్ల సాయంతో వెలికితీశారు, కొద్దిసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. కొన్ని రోజులు క్రితమే బోటు వెలికితీత చర్యలు చేపట్టగా, గోదావరిలో నీటి ఉధృతి తీవ్రంగా పెరగడంతో వెలికితీత పనులను అధికారులు నిలిపివేశారు.
మళ్ళీ రెండో దఫా వెలికితీత పనులు మొదలుపెట్టిన ధర్మాడి సత్యం బృందం మూడు రోజుల పాటు శ్రమించి, బోటును పూర్తి స్థాయిలో బయటకు తీయగలిగింది. అయితే ఇప్పటికే రైలింగ్, బోటు పై భాగం విడిగా రావడంతో వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది. సెప్టెంబర్ 15న బోటు మునిగిపోయిన సమయంలో అందులో 77 మంది పర్యాటకులు ఉన్నారు. వారిలో 26 మంది అప్పుడే ప్రాణాలతో బయటపడగా, వివిధ దశల్లో 39 మంది మృతదేహాలు లభించాయి. ఇంకా గల్లంతైన 12 మంది మృతదేహాలు లభ్యం కాకపోవడంతో, బోటు వెలికితీత వలన వారి ఆచూకీ తెలిసే అవకాశం ఉందని అధికారులు, వారి కుటుంబసభ్యులు భావిస్తున్నారు.
[subscribe]