తూర్పు గోదావరి జిల్లాలో కచ్చులూరు వద్ద సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 12 మంది ఉన్నారు. తెలంగాణ వాసుల కుటుంబాలకు పరిహారం విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున, మొత్తం రూ.1.20 కోట్లు విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. విడుదల చేసిన మొత్తం పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వ ఖాతాలో జమ చేసి మృతుల కుటుంబీకులకు అందజేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచన చేసింది. వరంగల్కు చెందిన 9 మందితో పాటు జనగామ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మరో ముగ్గురు ఈ ప్రమాదంలో మృతి చెందారు.
సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిపోయిన సమయంలో అందులో 77 మంది పర్యాటకులు ఉన్నారు. వారిలో 26 మంది అప్పుడే ప్రాణాలతో బయటపడగా, వివిధ దశల్లో మొదటగా 39 మంది మృతదేహాలు లభించాయి. అక్టోబర్ 22న ధర్మాడి సత్యం బృందం మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును వెలికితీయగా అందులో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. నలుగురి ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియ రాలేదు.
[subscribe]