దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. కరోనాపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా పలు దేశాలు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య సోమవారం రాత్రి కీలక ఫోన్ సంభాషణ జరిగింది. సంభాషణ అనంతరం ఇరువురు నేతలు ట్వీట్ చేశారు. ”అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ఫలవంతమైన సంభాషణ జరిగింది. మేము ఇరు దేశాలలో ఉన్నటువంటి కరోనా పరిస్థితిని చర్చించాం. భారతదేశానికి అమెరికా అందిస్తున్న సహకారానికి అధ్యక్షుడు బైడెన్ కు కృతజ్ఞతలు. అలాగే కరోనా వ్యాక్సిన్ ముడి పదార్థాలు, ఔషదాలు సున్నితమైన మరియు సమర్థవంతమైన సరఫరా ప్రాముఖ్యతపై చర్చించాం. భారతదేశం-అమెరికా హెల్త్ కేర్ భాగస్వామ్యం ప్రపంచానికి సవాల్ విసురుతున్న కోవిడ్-19 మహమ్మారి సంక్షోభాన్ని పరిష్కరించగలదు” అని ప్రధాని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ “ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాను, మరియు కోవిడ్-19 కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారత్ కు అత్యవసర సహాయం మరియు వనరులను అందించడానికి అమెరికా పూర్తి మద్దతుగా ఉంటుంది. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో భారతదేశం మా కోసం మద్ధతుగా ఉంది, మేము ఇప్పుడు వారి కోసం మద్దతుగా ఉంటాము” అని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో తయారవుతున్న కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని అమెరికా ఎత్తివేసిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ