ప్రధాని నరేంద్ర మోదీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఒడిశా రాష్ట్రంలో గల తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్కు కేటాయించాలని ఈ లేఖలో సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర విభజన తర్వాత సింగరేణి కోల్ కాలరీస్ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారని, బొగ్గు నిల్వల్లో కనీస వాటాను కూడా ఆంధ్రప్రదేశ్కు ఇవ్వలేదని ప్రధానికి వివరించారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాలకు సరిపడా బొగ్గు, సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ నుంచే సరఫరా అయ్యేదని, సింగరేణి కోల్ కాలరీస్ను తెలంగాణకు కేటాయించడంతో ఇతర రాష్ట్రాల నుంచే వచ్చే బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాం. దీనివల్ల రాష్ట్ర విద్యుత్ రంగంలో భరోసా లేకుండా పోయిందని తెలిపారు. ఈ పరిస్ధితి ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు తీవ్ర అవరోధంగా మారిందని పేర్కొన్నారు.
మార్చి 2020 నాటికి ఏపీ జెన్కో తన థర్మల్ కేంద్రాల ద్వారా మరో 1600 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పాదనకు సిద్ధమవుతోందని చెప్పారు. ఈ అదనపు విద్యుత్ తయారీకోసం ఏటా 7.5 ఎంఎంటీఏల బొగ్గు నిల్వలు అవసరం ఉంది. బొగ్గు కొరతను నివారించడానికి, బొగ్గు ఒప్పందాల ప్రకారం మరింత బొగ్గును సరఫరాచేయాల్సి ఉన్న నేపథ్యంలో మందాకిని కోల్ బ్లాక్, తాల్చేరు కోల్ఫీల్డ్, అంగుల్ బొగ్గు క్షేత్రాలను వెంటనే ఏపీజెన్ కోకు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు.
[subscribe]