గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో నవంబర్ 7, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఏంతో కాలంగా అగ్రిగోల్డ్ బాధితులు పడుతున్న ఆవేదనను అర్థం చేసుకున్నానని తెలిపారు. తొలి విడతలో భాగంగా 3 లక్షల 70 వేల కుటుంబాలకు న్యాయం చేస్తున్నామని అన్నారు. రూ.10 వేల లోపు డిపాజిట్లు చేసిన బాధితులను ఆదుకునేందుకు తోలి బడ్జెట్ లోనే కేటాయింపులు చేసి రూ.264 కోట్లు విడుదల చేశామని తెలిపారు.
ఈ సందర్భంగా రూ.10 వేల లోపు అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెక్కుల పంపిణీ చేశారు. రూ.10వేల లోపు నష్టపోయిన భాధితులకు ఆన్లైన్ విధానం ద్వారా చెల్లింపులు జరుపుతామని చెప్పారు. అదే విధంగా త్వరలోనే రూ.20 వేల లోపు డిపాజిట్ చేసి నష్టపోయినవారికి కూడ డబ్బులు అందజేస్తామని ప్రకటించారు. భవిష్యత్లో మిగిలిన వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే 4 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించాం. అలాగే గ్రామ సచివాలయాల ద్వారా లక్షా 30 వేల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. 2 లక్షల 25 వేల మంది ఆటో కార్మికులకు వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా సాయం అందించామని, పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి రైతుకు, రైతు భరోసా అందిస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 5 నెలల కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, నిలబెట్టుకున్న హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో వివరించారు.
[subscribe]