ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నవంబర్ 12, మంగళవారం అర్థరాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడి మూడు పల్టీలు కొట్టింది. అయితే కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో హీరో రాజశేఖర్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ఈ రోజు ఉదయం నుంచి ఈ ప్రమాదం వార్తలు బయటకు రావడంతో రాజశేఖర్ కి ఏం జరిగిందోనని అభిమానులు, సన్నిహితులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమాదంపై రాజశేఖర్ స్పందించారు. ప్రమాదానికి గురైనపుడు ఆ కారులో తాను ఒక్కడినే ఉన్నానని, ముందుగా పోలీసులకు ఆ తరువాత తన కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశాను, తనకు ఎలాంటి గాయాలు కాలేదు క్షేమంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.
‘మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఇంటికి వెళ్తుండగా పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా కారులో వస్తున్న వారు నన్ను గుర్తించి కారులోంచి బయటకు తీసుకొచ్చారు. అప్పుడు నేను వెంటనే వారి వద్ద ఫోన్ తీసుకుని మొదటి పోలీసులకు, తరువాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాను. అక్కడి నుంచి వారి కారులోనే ఇంటికి బయలు దేరాను. మార్గమధ్యంలో నా కుటుంబ సభ్యులు కారులో వచ్చి నన్ను పికప్ చేసుకున్నారని’ అభిమానులకు, మీడియాకు వివరణ ఇస్తూ రాజశేఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు.