బీసీసీఐ అధ్యక్షుడుగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాక గులాబీ బంతితో డే/నైట్ టెస్టు ఆడాలని ప్రతిపాదన తేవడం, అందుకు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీకరించిన సంగతి తెలిసిందే. డే/నైట్ విధానంతో టెస్టు క్రికెట్ చూడడానికి అభిమానులు పెద్ద స్థాయిలో స్టేడియనికి వస్తారని, తద్వారా టెస్ట్ క్రికెట్ కు మరింత ఆదరణ పెరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్ మైదానంలో నవంబర్ 22 నుంచి భారత్ తొలిసారిగా డే/నైట్ టెస్టు ఆడబోతుంది. అయితే శీతాకాలం కారణంగా రాత్రి 8 గంటల తర్వాత మైదానంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో కొంచెం ముందుగానే మ్యాచ్ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సిఎబి) అభ్యర్థన మేరకు ఆట సమయంలో మార్పులు చేసేందుకు బీసీసీఐ అంగీకరించినట్టు చెప్పారు.
మ్యాచ్ను మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభించి, తొలి సెషన్ మధ్యాహ్నం మూడు గంటలకు ముగిస్తామని చెప్పారు. మళ్ళీ 3:40కి రెండో సెషన్ ప్రారంభమయ్యి 5:40 వరకు కొనసాగుతుందన్నారు. చివరి సెషన్ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుందని, దీంతో ఈ టెస్టు మ్యాచ్పై మంచు ప్రభావం అంతగా ఉండదని తెలిపారు. భారత్, బంగ్లాదేశ్ తో ఆడుతున్న తొలి డే/ నైట్ టెస్టు మ్యాచ్ కు తొలి మూడు రోజులు 50 వేల మంది ప్రేక్షకులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఈ చారిత్రక డే/నైట్ టెస్టు మొదటి రోజున బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య అతిథిలుగా హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే క్రికెటర్ సచిన్ తెందూల్కర్, బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, అభినవ్ బింద్రా తదితరులు ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు.