కరోనా కల్లోల సమయంలో నెల్లూరు ఆనందయ్య పేరు వినని తెలుగువారు లేరు. అప్పటికి ఇంకా వాక్సీన్స్ ఏవీ రాని సమయంలోనే ఆనందయ్య.. ఆకులు, వనమూలికలతో కరోనా మహమ్మారికి మందు తయారుచేయటం.. అనేక మంది దానిని వాడటం కూడా జరిగింది. అప్పట్లో ఇది అనేక వివాదాలకు దారితీసింది. అయితే, తాజాగా ఆయనపై ఆయుష్ శాఖ సీరియస్ అయింది. ప్రస్తుతం ఒమిక్రాన్ పేరుతో మందు పంపిణీపై ఆనందయ్యకు ఆయుష్ శాఖ నోటీసులిచ్చింది. ఆనందయ్య పంపిణీ చేస్తోన్న ఒమిక్రాన్ మందుకు అనుమతి లేదని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. అనుమతి లేకుండా పంపిణీ ఎలా చేస్తారంటూ నోటీసులు ఇచ్చామని చెప్పారు.
ఆనందయ్య మందుతో 2 రోజుల్లో ఒమిక్రాన్ తగ్గిస్తామంటూ సోషల్ మీడియాతో ప్రచారం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆనందయ్య మందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆయుష్ అధికారులు ఆదేశించారు. ఆనందయ్య ఒమిక్రాన్ మందులో ఏమేం పదార్థాలు వాడుతున్నారో చెప్పాలని నోటీసుల్లో స్పష్టం చేశామన్నారు. ఆయన ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. లైసెన్స్ కోసం యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తీసుకున్నారని, కానీ ఇప్పటి వరకు దరఖాస్తు పెట్టలేదన్నారు. ఆనందయ్య అప్లికేషన్ పెడితేనే లైసెన్స్ లభిస్తుందని పేర్కొన్నారు.
దేశంలో కరోనా సెకండ్వేవ్ వణికిస్తున్న సమయంలో ఆనందయ్య మందు గురించి వార్తలు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో ఇస్తున్న ‘కృష్ణపట్నం ఆయుర్వేద మందు’ కరోనాకు బాగా పనిచేస్తోందనే ప్రచారం జరిగింది. ఈ మందుపై విశ్వాసంతో పక్క రాష్ట్రాలనుంచి కూడా చాలా మంది నెల్లూరు వచ్చారు. దీంతో వేల సంఖ్యలో ఆనందయ్య మందు కోసం జనం తరలివచ్చారు. అయితే, చివరకు ఈ ఔషధం శాస్త్రీయంగా రుజువు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని నిలుపుదల చేసింది. అయితే, ప్రజలు కరోనా, ఒమిక్రాన్ పేరుతో అనుమతి లేని మందులను వాడొద్దని కమిషనర్ రాములు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ