ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళనాడులో 11 కొత్త మెడికల్ కాలేజీలను మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (సీఐసీటీ) యొక్క కొత్త క్యాంపస్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, డాక్టర్ ఎల్.మురుగన్, డాక్టర్ భారతి పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొన్నారు. తమిళనాడులోని విరుదునగర్, నామక్కల్, దినీలగిరి, తిరుప్పూర్, తిరువళ్లూరు, నాగపట్నం, దిండిగల్, కళ్లకురిచ్చి, అరియలూర్, రామనాథపురం మరియు కృష్ణగిరి జిల్లాల్లో ఈ కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతున్నాయి. దాదాపు రూ.4000 కోట్ల అంచనా వ్యయంతో కొత్త మెడికల్ కాలేజీలు స్థాపించబడుతుండగా, వీటిలో దాదాపు రూ.2145 కోట్లు కేంద్ర ప్రభుత్వం అందిస్తుండగా, మిగిలిన మొత్తం తమిళనాడు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశంలో వైద్యుల కొరత చాలా కాలంగా సమస్యగా ఉందని, ప్రస్తుత ఈ క్లిష్టమైన అంతరాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని అన్నారు.
2014లో దేశంలో 387 మెడికల్ కాలేజీలు ఉండగా, గత ఏడేళ్లలో 54 శాతం పెరిగి ఈ సంఖ్య 596 మెడికల్ కాలేజీలకు చేరుకుందన్నారు. అలాగే 2014లో దేశంలో దాదాపు 82 వేల మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు ఉండగా, దాదాపు 80% పెరుగుదలతో గత ఏడేళ్లలో ఈ సంఖ్య దాదాపు లక్షా 48 వేల సీట్లకు చేరుకుందని చెప్పారు. ఇక 2014లో దేశంలో ఏడు ఎయిమ్స్ మాత్రమే ఉన్నాయని, కానీ 2014 తర్వాత ఆమోదం పొందిన ఎయిమ్స్ సంఖ్య 22కి పెరిగిందని, అదే సమయంలో వైద్య విద్యా రంగాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు పలు సంస్కరణలు చేపట్టామని ప్రధాని చెప్పారు. తమిళనాడులో ఈ రోజు ఏకంగా 11 మెడికల్ కాలేజీలను ప్రారంభించామని, ఇటీవలే ఉత్తరప్రదేశ్లో కూడా 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించామని ప్రధాని మోదీ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ