మహిళల వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు (గురువారం) హామిల్టన్లోని సెడాన్ పార్క్లో జరిగిన మ్యాచ్ లో మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టు ఆతిథ్య న్యూజిలాండ్పై పరాజయం పాలైంది. న్యూజిలాండ్ చేతిలో 62 పరుగుల తేడాతో భారత్ టోర్నీలో తొలి ఓటమిని చవిచూసింది. ఈ విజయంతో న్యూజిలాండ్ రెండో స్థానానికి ఎగబాకింది. అయితే, ఈ మ్యాచ్ లో భారత ప్లేయర్లు పూజా వస్త్రాకర్, హర్మన్ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ గెలిచిన కెప్టెన్ మిథాలీ రాజ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బౌలింగ్ లో వస్త్రాకర్ చెలరేగి 34 పరుగులకే 4 కీలక వికెట్లు తీసింది. దీంతో న్యూజిలాండ్ 9 వికెట్లకు 260 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరఫున, అమీ సాటర్త్వైట్ (75), అమేలియా కెర్ (50) అర్ధ సెంచరీలతో రాణించారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 198 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తరఫున హర్మన్ ప్రీత్ కౌర్ 71 పరుగులు చేసింది. యాస్తికా భాటియా (28), మిథాలీ రాజ్ (31) ఆకట్టుకున్నారు. టీమిండియా తమ తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను 107 పరుగుల తేడాతో ఓడించటం తెలిసిందే. ఆతిథ్య న్యూజిలాండ్ సహా మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ మరియు దక్షిణాఫ్రికా ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ ట్రోఫీ కోసం బరిలోకి దిగాయి. మెగా ఈవెంట్ ఫైనల్ మ్యాచ్ ఏప్రిల్ 3న క్రైస్ట్చర్చ్లో జరుగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ