ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం కీలక ప్రకటన చేశారు. తక్షణమే రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడానికి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) ఏకగ్రీవంగా ఓటు వేసిందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. దీంతో రెపో రేటు 4.40 శాతానికి చేరింది. కాగా ఆగస్టు 2018 తర్వాత ఆర్బీఐ రుణ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న సమయంలో మే 22, 2020న రెపో రేటు చివరిసారిగా తగ్గించబడింది. అప్పటినుంచి వరుసగా పదకొండు సార్లు కీలక రుణ రేట్లపై యథాతథస్థితి కొనసాగిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ రెపో రేటు పెంపుపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఆర్బీఐ తాజా ప్రకటనతో మార్కెట్ లలో కొంత ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి సెన్సెక్స్ 1330.82 పాయింట్లు పతనమై 55645.17 పాయింట్ల వద్ద, నిఫ్టీ 382.30 పాయింట్లు నష్టపోయి 16679.80 పాయింట్లకు వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు మే 21 నుండి బ్యాంకుల సిఆర్ఆర్ (నగదు నిల్వ నిష్పత్తి)ని 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.5 శాతానికి పెంచుతూ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుందని గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ