తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో నూతన మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈమేరకు గురువారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మత్స్య శాఖ నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని, నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్య కార్మికులు కోరుతున్నారని తెలిపారు. అయితే గత ప్రభుత్వాలలో ఎవరూ వీరి అభ్యర్థనలను పట్టించుకోలేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే వారి సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టారని గుర్తుచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మత్స్య కార్మికుల కోసం చేప పిల్లలు, రొయ్య పిల్లలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతోందని, ఇలాంటి కార్యక్రమం దేశంలోని మరే రాష్ట్రంలో అమలవడం లేదని హరీష్ రావు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా పలు ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు గ్రామాల్లోని చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలు విరివిగా జరగడంతో నీటి లభ్యత పెరిగిందని అన్నారు. తద్వారా చేపల పెంపకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.
నీటి వనరులు లేనప్పుడు రెండున్నర ఎకరాలకు ఒక సభ్యుడు ఉండగా, ఇప్పుడు పరిస్థితి మెరుగుపడటంతో ఎకరానికి ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోందని హరీష్ రావు తెలిపారు. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు కొత్తవి ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం 281 సోసైటీలు ఉండగా.. అందులో 20,731 మందికి సభ్యత్వం ఉందని గుర్తుచేశారు. ఈ సొసైటీలు జిల్లాలోని 1255 నీటి వనరులను వినియోగించుకుంటుండగా ఇంకా 381 నీటి వనరులకు సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ