ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఆయనతో పాటు 17 మంది అధికారుల బృందం కూడా పయనమైంది. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు వారిని ఆహ్వానించనున్నారు. ‘ప్రజలు – ప్రగతి – అవకాశాలు’ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ దావోస్ లో ఒక పెవిలియన్ ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమరనాథ్ ఇటీవల మీడియా సమావేశంలో తెలిపారు.
దీనిలో ‘టెస్టింగ్ – ట్రేసింగ్-ట్రీట్మెంట్’ పద్ధతిని ఉపయోగించి కోవిడ్ మహమ్మారిని అరికట్టడానికి అనుసరించిన వ్యూహాన్ని రాష్ట్రం ప్రదర్శిస్తుంది. అలాగే విద్య, ఆరోగ్యం మరియు అభివృద్ధి రంగాలలో ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలను కూడా ప్రదర్శిస్తుంది. అలాగే సదస్సులో ‘డీకార్బనైజింగ్ ఎకానమీ దిశగా ప్రపంచం’ అనే అంశంపై జరుగనున్న చర్చలలో సీఎం బృందం పాల్గొననుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డీకార్బనైజ్డ్ ఎకానమీకి కట్టుబడి ఉందని, ఇది పెట్టుబడి అవకాశాలపై కూడా దృష్టి పెడుతుంది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంలో భాగంగా ఇంటర్కనెక్టివిటీ, రియల్ టైమ్ డేటా, యాంత్రీకరణ మరియు ఆటోమేషన్ల పారిశ్రామికీకరణకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
పారిశ్రామికీకరణ 4.0కి సరైన వేదికగా మారేందుకు రాష్ట్రానికి అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాలను కూడా ఈ కార్యక్రమంలో వివరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సదస్సులో బెంగళూరు-హైదరాబాద్, చెన్నై-బెంగళూరు మరియు విశాఖపట్నం-చెన్నై కారిడార్లలో వివిధ పరిశ్రమల సంస్థలు మరియు పారిశ్రామికవేత్తలకు గల అవకాశాలను వివరించనున్నారు. సుశిక్షితులైన మానవ వనరులను ఎలా అభివృద్ధి చేస్తున్నారో కూడా ఇది తెలియజేస్తుంది. ఏపీలో పారిశ్రామికీకరణకి పోర్టులు ఎలా దోహదపడతాయో ఆంధ్రప్రదేశ్ ప్రదర్శిస్తుంది. దీనికి సంబంధించి దావోస్లో ముఖ్యమంత్రి విస్తృత చర్చల్లో పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ