కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేధింపులకు వ్యతిరేకంగా ‘ఛలో రాజ్భవన్’ కార్యక్రమం ద్వారా నిరసన చేపట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పిలుపునిచ్చింది. ఈ మేరకు కాగా పంజాగుట్టలోని రాజీవ్గాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాజ్భవన్ వద్ద జరిగే ర్యాలీ, నిరసన కార్యక్రమాలలో పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొనాలని ఆయన కోరారు. అయితే రాజ్భవన్ వద్ద ర్యాలీ, నిరసనలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినాసరే ర్యాలీ జరిపి తీరుతామని రేవంత్ ప్రకటించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజ్భవన్కు చేరుకోవడంతో వీరిని అడ్డుకోవడానికి ప్రభుత్వం కూడా పోలీసులను కూడా భారీగా మొహరించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల చర్యలకు నిరసనగా ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు బైక్కు నిప్పుపెట్టి, బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాజ్భవన్ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజ్భవన్ వద్దకు ఆందోళనకారులు చేరకుండా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. రాజ్భవన్ చుట్టూ పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు.
కాగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యుఐ) గురువారం తెల్లవారుజామున ఇక్కడి రాజ్భవన్ను ముట్టడించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో రాజ్భవన్ ఎదుట ఎన్ఎస్యూఐ తెలంగాణ యూనిట్ నాయకులు, కార్మికులు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్తో పాటు ఇతర కార్యకర్తలను కూడా అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పలువురు నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ