జూన్ 28 నుండి ప్రారంభమై ఏడాది పాటు కొనసాగనున్న దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని 51 దేశాల్లోని ఎన్ఆర్ఐలతో జూన్ 26, శుక్రవారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 28 న జరగనున్న పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని వీరికి మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచే తెలంగాణ అస్ధిత్వానికి అండగా నిలిచిన మహనీయుల సేవలను స్మరించుకోవడంలో ముందు వరుసలో ఉన్నదన్నారు. ఈ మేరకు పీవీ నర్సింహారావు, ఈశ్వరీభాయి, వెంకటస్వామి లాంటి వారిని పార్టీలకతీంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు వారి సేవలను స్మరించుకుంటూ వారి జయంతులను అధికారికంగా జరిపేలా ఆదేశాలిచ్చారన్నారు. అలాగే ప్రొఫెసర్ జయశంకర్, పీవీ నర్సింహారావు, కోమురం భీం వంటి మహనీయుల పేర్లను యూనివర్సీటీలు, జిల్లాలకు పెట్టి స్మరించుకుంటున్నామన్నారు.
తెలుగు ప్రజల ఖ్యాతిని ఖండాంతారాలకు తెలిసేలా చేసిన మహనీయుడు పీవీ గారికి రావాల్సిన పేరు రాలేదని, భారతరత్న దక్కాల్సిన అవసరం ఉందని మంత్రి కేటిఆర్ అన్నారు. ఈమేరకు పీవీకి భారత రత్న దక్కాలని ప్రధానికి స్వయంగా కలిసి విజ్ఞప్తి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకునికిగా, ప్రధానిగా అధ్బుతమైన సేవలందించిన మహనీయుడి జయంతిని రానున్న సంవత్సరం పాటు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఏన్నారైలు అందరు శతజయంతి ఉత్సవాల్లో పాల్గోనాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ముందుగా ఆదివారం జరిగే జయంతి ఉత్సవాల్లో అన్ని దేశాల్లోని తెలుగువారందరిని కలుపుకొని ఆయన జయంతిని జరుపుకోవాలని కేటీఆర్ అన్నారు. ఇందుకోసం తెలంగాణ సంఘాలతో పాటు మిగిలిన తెలుగు సంఘాలతో సమన్వయం చేసుకొని ఈ ఉత్సవాలను నిర్వహించాలన్నారు. రానున్న సంవత్సరం పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించి సమన్వయం చేసుకొనేందుకు ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాలను శతజయంతి ఉత్సవాల కమిటీలో సభ్యునిగా చేర్చుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu