దేశ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు ప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభం కాగా, తొలిరోజే మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా ఈ 11లో సరైన పత్రాలు లేకపోవడంతో ఒకరి నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బుధవారం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లకు చెందిన వారు ఉన్నారు. బీహార్లోని సారాణ్ నియోజకవర్గానికి చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ అనే వ్యక్తి కూడా నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు.
కాగా రాష్ట్రపతి ఎన్నిక కోసం అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాన్ని నిర్ణీత ఫార్మాట్ లో తయారుచేయడంతో పాటుగా ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న 50 మంది ఎంపీ/ఎమ్మెల్యేల ప్రతిపాదించడం, మరో 50 మంది ద్వితీయార్థులుగా బలపరచాల్సి ఉంటుంది. ఎన్నికల సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.15 వేలు కూడా డిపాజిట్ చేయాలి. దీంతో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు మద్దతు లేని అభ్యర్థుల నామినేషన్స్ అన్ని పరిశీలన సమయంలో తిరస్కరణ గురయ్యే అవకాశం ఉంది. ఈ నామినేషన్ల ప్రక్రియ జూన్ 29 వరకు కొనసాగుతుంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నిక కోసం అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గాని, యూపీఏ/ఇతర విపక్షాలు కానీ తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.
రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ వివరాలు:
- రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్: జూన్ 15, 2022
- నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు: జూన్ 29
- రాష్ట్రపతి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన: జూన్ 30
- నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: జూలై 2
- రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహణ: జూలై 18
- ఓట్ల లెక్కింపు పక్రియ: జూలై 21
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY