గత రెండు రోజులుగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రారంభమైన నేరేడుచర్ల మున్సిపాలిటీ సమావేశం తీవ్ర వాగ్వాదాలు, ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగింది. ఎక్స్అఫిషియో ఓట్లతో మెజారిటీ సాధించిన టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని ఎట్టకేటలకు కైవసం చేసుకుంది. ఏడుగురు కౌన్సిల్ సభ్యులు, నలుగురు ఎక్స్అఫీషియో ఓట్లతో టిఆర్ఎస్ పార్టీకి చెందిన చందమల్లు జయబాబు ఛైర్మన్గా ఎన్నికయ్యారు. అలాగే చల్లా శ్రీలత వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు.
ముందుగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డికి ఎక్స్అఫీషియో ఓటు హక్కు కల్పించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. నేరేడుచర్ల ఛైర్మన్ పదవిని దక్కించుకోవాలని అధికారపార్టీ నిబంధనలకు విరుద్ధంగా అన్ని ప్రయత్నాలు చేస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరపున గెలిచిన సభ్యులతో కలిసి సమావేశాన్ని బహిష్కరించారు. ఎక్స్అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి ఉత్తమ్కుమార్రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి స్టేషన్కు తరలించారు.
[subscribe]