వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె ఆంధ్రప్రదేశ్ వచ్చిన సందర్భంగా విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డికె అరుణ మాట్లాడుతూ.. తమ కుటుంబంలో తెలెత్తిన విభేదాల వల్లనే షర్మిల పార్టీ పెట్టారని, కానీ తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో షర్మిల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె, షర్మిల ఏపీలో పోటీ చేయాలి కాని, తెలంగాణలో పార్టీ పెట్టడమెందుకని డీకే అరుణ నిలదీశారు.
గతంలో వైఎస్ఆర్ కుటుంబంలోని వారు ఎప్పుడూ తెలంగాణ కోసం పోరాడలేదని, పని చేయలేదని చెప్పిన అరుణ ఎపీలో ఎందుకు పోటీ చేయడం లేదో షర్మిల సమాధానం చెప్పాలని డీకే అరుణ అన్నారు. షర్మిల పార్టీకి తెలంగాణలో ఒక్క సీటు కూడా రాదని, షర్మిల పాదయాత్ర చేసినా ఉపయోగం లేదని, ఏపీకి వెళ్లి రాజకీయాలు చేసుకోవాలని హితవు పలికారు. కుటుంబ పాలనకు బిజెపి వ్యతిరేకం అని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిపారు. తెలంగాణలో సెంటిమెంట్ ఉన్నంతవరకు ఆంధ్రా వాళ్లు ఎవరు పార్టీ పెట్టినా ఇక్కడి ప్రజలు ఆదరించరని, ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని డీకే అరుణ జోస్యం చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చి 75యేళ్లు పూర్తి అయిన సందర్భంగా సంబరాల్లో ప్రజలను భాగ స్వామ్యం చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారని, దీనిలో భాగంగానే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో వివిధ కార్యక్రమాలు చేపట్టారని అరుణ గుర్తు చేశారు. ప్రజలందరూ కూడా దేశభక్తిని, జాతీయ భావాన్ని చాటి చెప్పేలా జాతీయ, రాష్ట్ర, జిల్లా, బూతు స్థాయి వరకు ఈ కార్యక్రమం జరుపుకోవాలని కోరిన అరుణ, ఎపీలో కూడా అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, ప్రతి ఇంటి పైనా త్రివర్ణ పతాకం ఎగుర వేయాలని సూచించారు. అలాగే ప్రతి భారతీయుడు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని, మీరు చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని డీకే అరుణ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ