తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలకు డిల్లీ రావాల్సిందిగా కబురు వచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వారికి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ముఖ్య నేతలు సమావేశం కాబోతున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికలతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కూడా చర్చ జరగనుంది. దీంతో ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడం కోసం ఢిల్లీలోనే ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు కూడా సమావేశానికి హాజరవనున్నారు. ఇక హైదరాబాద్ నుంచి పార్టీ చేరికల కమిటీ చైర్మన్, సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి, పార్టీ కార్యదర్శి బోసురాజులుకు హైకమాండ్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. జానారెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపనట్లు సమాచారం.
కాగా అసలు ఈ వ్యవహారమంతటికీ కారణమైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం రాష్ట్రంలో ఆసక్తి కలిగిస్తోంది. రాజగోపాల్ రెడ్డి తమ పార్టీలోకి వస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు రాజగోపాల్ రెడ్డి తమతోనే ఉంటారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేస్తున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు విషయం అన్ని పార్టీలలో ఒకింత ఉత్కంఠ కలిగిస్తోంది. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ప్రకటనలతో మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది. అటు రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ మార్పు, రాజీనామాపై పూర్తి స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై పూర్తి సమాచారం కోసం పార్టీ ముఖ్యలతో సమావేశమవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY