మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం రాత్రి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. ఈ మేరకు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ వైఖరిని తెలియజేశారు. వ్యాపారాలు చేసుకునే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వలెనే గుర్తింపు వచ్చిందని, ఎంపీగా, ఎమ్మెల్యేగా పార్టీ అవకాశాలిచ్చిందని అన్నారు. ఆయన ఒక దఫా ఎన్నికల్లో ఓడిపోయినా సందర్భంలో పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని రేవంత్ గుర్తు చేశారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి పార్టీకి విధేయుడైన నాయకుడని, అందుకే ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతారని, అయితే ఇక నుంచి రాజగోపాల్ కాంగ్రెస్ బిడ్డగా భావించమని రేవంత్ స్పష్టం చేశారు.
ఒకవైపు మోదీ సర్కార్ సోనియా గాంధీపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుంటే.. ఈ సమయంలో పార్టీకి, అధిష్టానానికి అండగా ఉండాల్సిన నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఇలా పార్టీని వదిలేసి వెళ్లిపోవడం బాధ్యతలను వదిలేసి పోవడమేనని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. కాంట్రాక్టులు, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ను వీడాలని రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకున్నారని, కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు ఆగస్టు 5న పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే కొండంత అండ అని, మునుగోడులో త్వరలోనే కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ చేశారు. అలాగే ఆగస్టు 5వ తేదీన మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, తద్వారా తెలంగాణలోని ఇతర పార్టీలకు కాంగ్రెస్ బలం ఏంటో అర్ధమయ్యేలా చేస్తామని అన్నారు. ఇక మునుగోడులో ఎప్పుడు ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎదుర్కొంటామని, గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY