ఎన్నికల వేళ ఆయా రాష్ట్రాల్లో ఏ చిన్న ఘటన వెలుగులోకి వచ్చినా.. దాని చుట్టూ పెద్ద రాద్దాంతమే జరుగుతుంది. అది అధికార పక్షానిదైతే విపక్షం.. విపక్షానిదైతే అధికార పక్షం ఆందోళనలకు శ్రీకారం చుడతాయి. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో రాష్ట్రాన్ని.. రాజకీయాలను వేడెక్కిస్తాయి. అదే ఘటన ప్రాణాలకు సంబంధిచినదైతే ఇక చెప్పే పనే లేదు. అందుకు కారణం మీరంటే.. మీరంటూ రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తాయి. ఇప్పుడు తెలంగాణలో అలాంటి రాజకీయాలే జరుగుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మర్రి ప్రవల్లిక (23) చిక్కడపల్లి ఠాణా అశోక్నగర్లోని బృందావన్ బాలికల హాస్టల్లో ఉంటూ గ్రూప్స్నకు శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం రాత్రి ఆమె తన గదిలో ఉరి వేసుకుంది. ఈ విషయం తెలిసి అశోక్నగర్లోని హాస్టళ్లలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు, ఓయూ విద్యార్థి, కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్ నాయకులు తరలివచ్చారు. నిమిషాల వ్యవధిలోనే చేరుకున్న వందలాది విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, టీఎస్పీఎస్సీ వైఫల్యం వల్లే పరీక్షలు వాయిదా పడుతున్నాయని .. అందుకే ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని మండిపడ్డాయి. అంతేకాదు.. అర్థరాత్రి ఆ ప్రాంతం రణరంగంగా మారింది.
ఎన్నికల పేరుతో వాయిదా..
ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచీ కేసీఆర్ సర్కారు నిరుద్యోగులను ఆకట్టుకునే పలు ప్రకటనలు చేసింది. పలు జీవోలూ జారీ చేసింది. ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని పేర్కొంది. డీఎస్సీ కూడా విడుదల చేసింది. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా డీఎస్సీ వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన నిన్న తెలిపారు. డీఎస్సీలో భాగమైన సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ) పరీక్షలు మాత్రమే వాయిదా పడ్డాయి. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, భాషా పండిట్లు, ఎస్జీటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో ఎస్జీటీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించడంతో చాలా మంది శిక్షణ పొందుతున్నారు. కఠోరంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటన రావడం.. అదే రోజు రాత్రి ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన రేకెత్తించింది.
వాయిదానే కారణమా?
సంవత్సరాల తరబడి ప్రిపేరవుతుంటే అదేమీ పట్టించుకోకుండా, పేపర్ లీకేజీలు.. పరీక్షలు రద్దు చేస్తూ విద్యార్థుల జీవితాలతో సర్కారు చెలగాటమాడుతున్నారని విద్యార్థులు సర్కారుపై యఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల వెతలు అర్ధం చేసుకోకుండా వ్యవహరించడం తగదంటూ మండిపడ్డారు. టీఎస్ ఎస్ పీఎస్సీ నిర్లక్ష్యం వల్లే పోటీ పరీక్షలు రద్దవుతున్నాయని ఆరోపిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ డౌన్డౌన్ అంటూ శుక్రవారం అర్ధరాత్రి పెద్దపెట్టున నినాదాలు చేశారు. కేసీఆర్ వచ్చి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక రంగంలోకి విపక్షాలు దిగేశారు. సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్, బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ , టీజేఎస్ నగర అధ్యక్షుడు నర్సయ్య తదితరులు హాస్టల్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా వేసినందుకే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. ఇక ఈరోజు కూడా దీనిపై నిరసన జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
అసలు.. సూసైడ్ నోట్ లో ఏముందంటే..
ఆందోళనలు ఇలా ఉండగా.. ప్రవల్లిక సూసైట్ నోడ్ అంటూ ఓ కాగితం బయటకు వచ్చింది. అందులో.. ‘‘నన్ను క్షమించండి అమ్మా… నేను చాలా నష్టజాతకురాలిని. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం. నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా అమ్మా, నాన్న జాగ్రత్త’’ అని ఆవేదనగా రాసి ఉంది. దీంతో అధికార పక్ష నాయకులు విపక్షాలపై ఫైర్ అవుతున్నారు. ఆమె చావుకు గల కారణాలను సరిగా తెలుసుకుని స్పందించాని కౌంటర్ ఇస్తున్నారు.
48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
ప్రవళిక సూసైడ్పై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. ప్రవళిక మృతి ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్పీఎస్సీ సెక్రటరీని ఆదేశించారు గవర్నర్. ప్రవళిక మృతిపై కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ప్రవళిక అకాల మరణం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఔత్సాహికులకు సవాళ్లు, ఒత్తిడిని గురిచేస్తుందని అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న అమ్మాయి తన జీవితాన్ని కోల్పోయినందుకు విచారంగా ఉన్నప్పటికీ.. ఈ విషాద ఘటన ద్వారా లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు గవర్నర్ తమిళిసై తెలిపారు. నిరుద్యోగ యువత ఆశలు వదులుకోవద్దని, ఉపాధిని పొందే దిశగా ధైర్యం ప్రదర్శించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.