ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి పలువురు అధికారులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలకు సిద్ధమయ్యారు. మందుల కొనుగోళ్ల అక్రమాలలో కీలక పాత్రదారిగా భావిస్తున్న ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. షేక్పేటలోని ఆమె నివాసం నుంచి ఆమెను బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు పలు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆమెతో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మను కూడ అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 17మంది సంబంధిత ఉద్యోగులు, నలుగురికి పైగా బయట వ్యక్తులకు ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ విభాగంలో జరిగిన అవినీతికి సంబంధించి, ఆ విభాగానికి చెందిన 23 మంది ఉద్యోగుల ఇళ్లపై గురువారం నాడు ఒకే సమయంలో ఏసీబీ దాడులు జరిపింది. దాదాపుగా రూ.12 కోట్ల నకిలీ బిల్లులకు చెందిన ముఖ్యమైన ఆధారాలు, దస్త్రాలు అధికారులు సంపాదించినట్టు తెలుస్తుంది. ఎటువంటి అవసరం లేకున్నా, నకిలీ బిల్లులు సృష్టించి మందులు కొనుగోలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్తో పాటు వరంగల్లోనూ కూడ ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. తనిఖీల అనంతరం డైరెక్టర్ దేవికా రాణితో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, సీనియర్ అసిస్టెంట్ హర్షవర్థన్, ఈఎస్ఐ ఉద్యోగి నాగరాజు,ఎండీ శ్రీహరి, ఫార్మసిస్ట్ రాధికను అరెస్ట్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు, శుక్రవారం మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో వారిని ప్రవేశపెట్టనున్నారు.
[subscribe]