స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు యువతీ, యువకులు, యావత్ తెలంగాణ సమాజం ఈ ఉత్సవాలల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 1 కోటీ 20 లక్షల గృహాలకు జాతీయ జండాలను ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు.
భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు, ఇతర ముఖ్యులతో ప్రగతి భవన్ లో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ప్రతి గుండెలో భారతీయత:
‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ లో భాగంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే రోజు వారీ కార్యక్రమాలను సమీక్షించారు. ఆగస్టు 15న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతి ఇంటిపై జాతీయ జెండా కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా తీసుకోవాల్సిన చర్యలను సీఎం సూచించారు. ఇందుకు సంబంధించి 9వ తేదీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీ చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపాలిటీలు గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో జరగాలన్నారు.
ఆగస్టు 8న ఘనంగా వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమం:
వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ సమారోహాన్ని హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఘనంగా నిర్వహించాలని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా ఆర్మీ/పోలీస్ బ్యాండుతో రాష్ట్రీయ సెల్యూట్, జాతీయ గీతాలాపన, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన నిర్వహించాలన్నారు. అనంతరం స్వాగతోపన్యాసంతో పాటు, అధ్యక్షులవారి తొలిపలుకులు, సీఎం వజ్రోత్సవ వేడుకల ప్రత్యేక సందేశం ప్రసంగం, వందన సమర్పణ ఉంటుంది.
రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, అన్నిజిల్లాల రైతుబంధు సమితి అధ్యక్షులు, జెడ్పిటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, అన్ని శాఖల హెచ్ఓడీలు, జిల్లా కేంద్రాల్లో ఉండే అందరు ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ తదితర రక్షణ రంగానికి చెందిన కమాండర్స్, వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్యాధికారులను, తదితర రెండు వేల మంది ఆహుతుల సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.
సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు:
- బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, స్టార్ హోటల్లు, దవాఖానాల్లో, షాపింగ్ మాల్స్ లలో ప్రత్యేకాలంకరణలను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి
- ప్రభుత్వ భవనాలు ఇతర ప్రతిష్టాత్మక భవనాలను ముఖ్యమైన పబ్లిక్ ప్లేసుల్లో ఈ పదిహేను రోజుల పాటు విద్యుత్ దీపాలు, ప్రత్యేకాలంకరణలను ఏర్పాటు చేయాలి. జాతీయ జెండా ఎగరవేయాలి
- ప్రభుత్వ మరియు ప్రయివేట్ పాఠశాల, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు, వక్తృత్వ పోటీ, వ్యాస రచన పోటీ, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు, ఉపాధ్యాయులు, లెక్చరర్లకు దేశభక్తి పై కవితారచన పోటీలు నిర్వహించాలి
- ప్రతి రోజూ ప్రార్థన సమయంలో అన్ని రకాల విద్యాసంస్థల్లో ఎంపిక చేసిన దేశభక్తి గీతాలను మైకుల ద్వారా వినిపించాలి
- రిచర్డ్ అటెన్ బరో నిర్మించి, దర్శకత్వం వహించిన గాంధీ సినిమాను రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ప్రభుత్వ మరియు ప్రయివేటు విద్యాసంస్థల విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిరోజూ ప్రదర్శించాలి
- గ్రామం మండల జిల్లా రాష్ట్ర స్థాయిల్లో ఫ్రీడం కప్ పేరుతో ఆటల పోటీల నిర్వహించాలి. విజేతలకు బహుమతులు ప్రధానం చేయాలి
- వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారిని కలుపుకొని ప్రత్యేక ర్యాలీలు నిర్వహించాలి
- ఈ పదిహేను రోజుల వేడుకల్లో ఒక రోజున రాష్ట్రమంతటా ఏక కాలంలో, ఎక్కడివాల్లక్కడ ‘తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన’ జరిపించాలి. ఇందుకు పోలీసు శాఖ బాధ్యత వహించాలని డిజిపి మహేందర్ రెడ్డికి సీఎం సూచన
- స్వాతంత్య్ర సమరం ఇతివృత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కవిసమ్మేళనాలను, ముషాయిరాలను నిర్వహించాలని సాంస్కృతిక శాఖ అధికారులకు సీఎం ఆదేశం
- వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలి. ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేయాలి
- యువతీ, యువకులు క్రీడాకారులు ఇతర వర్గాల భాగస్వామ్యంతో ప్రీడం 2కె రన్ నిర్వహించాలి
- స్వాతంత్య్ర స్ఫూర్తిని రగలించే విధంగా బెలూన్ల ప్రదర్శన
- రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో రక్తదాన శిబిరాలను నిర్వహించాలి
- దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో, జైల్లల్లో, వృద్ధాశ్రమాలల్లో పండ్లు స్వీట్లు పంచాలి
- వజ్రోత్సవాల సందర్భంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలి. దాంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయితీలు, మండల పరిషత్, జిల్లాపరిషత్, మున్సిపల్ సహా ప్రజల చేత ఎన్నిక కాబడిన అన్ని రకాల లోకల్ బాడీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు
- ఈ వజ్రోత్సవ సమాశాల్లో స్వాతంత్య్ర పోరాట వీరులకు ఘన నివాళులు అర్పించాలని సీఎం నిర్ణయించారు
- వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 15 ఆగస్టుకు ముందురోజు 14న తాలుకా, జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా బాణాసంచా కార్యక్రమాలను నిర్వహించాలి
- జిల్లా స్థాయిలో ఇంజార్జీ మంత్రి అధ్యక్షులుగా కలెక్టరు, కన్వీనర్ గా వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సభ్యులుగా ప్రత్యేక నిర్వహణ కమిటీలు వేయాలని సీఎం నిర్ణయించారు
- దేశ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ గాయకులు, సంగీత విద్వాంసులతో ప్రత్యేక సంగీత విభావరిని నిర్వహించాలి
- సమాజంలోని అట్టడుగు వర్గాలను నిరాదరణకు గురైన వర్గాలను గుర్తించి ఆదుకోవడం కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం అన్నారు
- జిల్లాకొక ఉత్తమ గ్రామపంచాయితీని, మున్సిపాలిటీని, పాఠశాల, ఉత్తమ రైతు డాక్టర్, ఇంజనీరు, పోలీస్ అధికారి, తదితర ఉద్యోగులు, కళాకారుడు, గాయకుడు, కవిని గుర్తించి సత్కరించాలని సీఎం నిర్ణయించారు
- రవీంద్రభారతిలో 15రోజుల పాటు స్వాతంత్ర్య సమర స్ఫూర్తి ఉట్టిపడే విధంగా ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY