కామన్ వెల్త్ గేమ్స్-2022 లో భారత్ అథ్లెట్లు మరోసారి స్వర్ణ పతకాలతో సత్తా చాటారు. ఐదో రోజైన ఆగస్టు 2, మంగళవారం నాడు భారత్ ఖాతాలో మరో 4 పతకాలు చేరాయి. లాన్ బౌల్స్ గేమ్ లో భారత్ బృందం మరియు టేబుల్ టెన్నిస్లో భారత్ పురుషుల టీమ్ స్వర్ణాలు కైవసం చేసుకోగా, భారత్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ మరియు వెయిట్ లిఫ్టర్ వికాస్ ఠాకూర్ రజత పతకాలు గెలుచుకున్నారు. దీంతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో 5 స్వర్ణ, 5 రజత, 3 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 13 మెడల్స్ చేరాయి. కాగా 13లో 8 పతకాలు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలోనే సాధించడం విశేషం.
టేబుల్ టెన్నిస్లో భారత్ పురుషుల జట్టు మరోసారి అత్యుత్తమ ప్రదర్శన చేసి, వరుసగా రెండవసారి కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణాన్ని దక్కించుకుంది. ఫైనల్లో భారత్ 3-1 తో సింగపూర్ జట్టును ఓడించింది. డబుల్స్లో హర్మీత్ దేశాయ్-సాథియాన్ జ్ఞానశేఖరన్ జంట గెలుపొందగా, సింగిల్స్లో శరత్ కమల్ ఆచంట పరాజయం పాలయ్యాడు. అయితే సింగిల్స్ లో హర్మీత్ దేశాయ్, సాథియాన్ జ్ఞానశేఖరన్ విజయాలు సాధించడంతో భారత్ 3-1తో ఆధిక్యం సాధించి స్వర్ణాన్ని దక్కించుకుంది. అలాగే బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ మలేసియా టీమ్ పై 1-3 తో ఓటమి పాలైంది. దీంతో గత కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత బృందం ఈసారి రజతంతో సరిపెట్టుకుంది. మొదట పురుషుల డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ ఓడిపోయి 0-1 తో ఉండగా, మహిళల సింగిల్స్లో పీవీ సింధు అద్భుత విజయంతో 1-1 కి చేర్చింది. అయితే పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి గోపీచంద్-ట్రెసా జాలీ జోడీ కూడా మలేసియా టీమ్ పై పరాజయం పాలవడంతో 3-1తో మలేసియా స్వర్ణాన్ని, భారత్ టీమ్ రజతాన్ని దక్కించుకున్నాయి.
ఇక పురుషుల 96 కేజీల విభాగంలో వికాస్ ఠాకూర్ 346 కేజీలు (స్నాచ్లో 155 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 191 కేజీలు) ఎత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మరోవైపు కామన్ వెల్త్ గేమ్స్-2022 లో మంగళవారం వారం పతకాలు సాధించిన భారత్ లాన్ బౌల్స్ టీమ్(లవ్లీచౌబే, పింకీ, నయన్ మోని, రూపా రాణి టిర్కీ), భారత్ టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్(సాథియాన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్, శరత్ కమల్ మరియు సనీల్ శెట్టి), భారత్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్(సాత్విక్ సాయిరాజ్, శెట్టి చిరాగ్, కిదాంబి శ్రీకాంత్, బస్ సుమీత్ రెడ్డి, లక్ష్యా సేన్, ఆకర్షి కశ్యప్, పీవీ సింధు, పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప), వెయిట్ లిఫ్టర్ వికాస్ ఠాకూర్ లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY