తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి మేడారం చేరుకొని వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్లు, ఎర్రబెల్లి దయాకర్ రావు, అధికారులు, గిరిజన పూజారులు సీఎం కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ సమ్మక్క, సారలమ్మలకు పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వనదేవతలకు నిలువెత్తు బంగారం(బెల్లం) ను కానుకగా సమర్పించారు. అనంతరం ఏరియల్ వ్యూ ద్వారా మేడారం జాతర జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.
తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున జాతరకు తరలిరావడంతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. తండోపతండాలుగా వస్తున్న భక్తులు కిలోమీటర్ల మేర క్యూలో వేచి ఉన్నారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రులు జాతరలో ఏర్పాట్లును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
[subscribe]